తెలంగాణ

telangana

ETV Bharat / state

Rahul meet war in OU: రాహుల్ ఓయూ పర్యటన.. అనుమతి నిరాకరణపై కాంగ్రెస్ ఆందోళన

Rahul meet war in OU: ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన రాజకీయంగా కాకరేపుతోంది. ఈనెల 7న ఓయూ పర్యటనకు రాహుల్​ గాంధీకి వీసీ అనుమతించకపోవడంపై రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనబాట పట్టాయి. ఓయూలో రాహుల్‌ పర్యటించకుండా ముఖ్యమంత్రి కేసీఆరే అడ్డుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అరెస్టు చేసిన విద్యార్థి నేతలను పరామర్శించేందుకు వెళ్లిన జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు.

By

Published : May 1, 2022, 10:11 PM IST

Rahul meet war in OU
బంజారాహిల్స్ పీఎస్​లో కాంగ్రెస్ నేతలు

రాహుల్ ఓయూ పర్యటన.. అనుమతి నిరాకరణపై కాంగ్రెస్ ఆందోళన

Rahul meet war in OU: రాష్ట్రంలో ఈ నెల 6, 7 తేదీల్లో ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. మే 6న ఓరుగల్లులో రైతు సంఘర్షణ సభలో పాల్గొని తర్వాతి రోజు హైదరాబాద్‌ ఓయూలో విద్యార్థులతో మాట్లాడాలని కాంగ్రెస్‌ నేతలు ప్రణాళిక రూపొందించారు. అయితే ఉస్మానియా వర్సిటీలో పర్యటనకు వీసీ అనుమతిని ఇవ్వకపోవడంపై నేతలు మండిపడుతున్నారు. ఓయూ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఛాంబర్‌ ఎదుట ఎన్ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ నిరసన వ్యక్తం చేశారు. దీంతో బల్మూరి వెంకట్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడకు ఎన్​ఎస్​యూఐ విద్యార్థులు చేరుకోగా.. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓయూ ఠాణాకు తరలించారు. మరోవైపు మరికొందరు ఎన్​ఎస్​యూఐ విద్యార్థి సంఘం నేతలు బంజారాహిల్స్​లోని మంత్రుల నివాస సముదాయం ముట్టడికి యత్నించారు. వారిని అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓయూలో నిరసన చేపట్టిన ఎన్​ఎస్​యూఐ నేత బల్మూరి వెంకట్‌ సహా 17మందిని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

రేవంత్ మండిపాటు: ఓయూలో రాహుల్ గాంధీ పర్యటించకుండా సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్‌ వస్తే సీఎం ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి వద్దంటూ తెరాస నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చినందుకు క్షమాపణ చెప్పాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో నిరసనలకు అనుమతించామని గుర్తు చేశారు.

ఉత్తమ్ ఫైర్: దేశంలో ఉస్మానియా యూనివర్సిటీ ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదని ఎంపీ ఉత్తమ్​ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 25లక్షల మంది నిరుద్యోగులుగా పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఓయూలో రాహుల్ పర్యటిస్తే ప్రభుత్వం నిర్లక్ష్యం బయట పడుతుందన్నారు. రాహుల్ పర్యటనలో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ప్రతి ఒక్కరు సభ నిర్వహించుకున్నారని.. ఓయూ కేసీఆర్ జాగీర్ కాదన్నారు. రాహుల్ గాంధీ కోసం ఉస్మానియా విద్యార్థులు ఎదురుచూస్తున్నారని వెల్లడించారు.

వీహెచ్​ ఆగ్రహం: రాహుల్ పర్యటనపై సంబంధం లేని తెరాస నేతలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత వీహెచ్ విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డి, హోంమంత్రి కనీసం స్పందించడం లేదన్నారు. తెలంగాణలో విద్యార్థుల భవిష్యత్తును తెలుసుకోవడానికే రాహుల్ వస్తున్నారని తెలిపారు. ఓయూ విద్యార్థులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఓయూలో పరిస్థితి బాగుంటే తెరాస నాయకులు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. కేసీఆర్ ఉస్మానియా యూనివర్శిటీలో ఎన్నో సభలు నిర్వహించారని గుర్తు చేశారు. బల్మూరి వెంకట్​ను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల అదుపులో జగ్గారెడ్డి: బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న విద్యార్థి నేతలను పరామర్శించేందుకు వెళ్లిన పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయూలో రాహుల్‌ పర్యటన కోసం న్యాయపరంగా ప్రయత్నిస్తున్నామని కుదరకపోతే.. పీసీసీ, ఇన్‌ఛార్జి ఠాగూర్‌తో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. జగ్గారెడ్డిని అరెస్టు చేయడంపై బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లిన కాంగ్రెస్‌ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరామర్శించేందుకు వచ్చిన నేతలను నిర్బంధించడం దారుణమని విమర్శించారు.

బల్మూరి వెంకట్ సహా 18 మందిపై కేసు:ఓయూ వీసీ చాంబర్‌ వద్ద ధర్నా ఘటనలో బల్మూరి వెంకట్ సహా 18 మందిపై కేసు నమోదు చేశారు. మహిళా కానిస్టేబుళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని కేసు నమోదైంది. కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పలు సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్​ఎస్​యూఐ నేత బల్మూరి వెంకట్‌ సహా 18 మందిని కోర్టులో హాజరుపరచిన ఓయూ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

ఇవీ చూడండి:Rahul Gandhi Telangana Tour: రాష్ట్రంలో రాహుల్‌ గాంధీ పర్యటన షెడ్యూల్ విడుదల

ABOUT THE AUTHOR

...view details