తెలంగాణ

telangana

By

Published : Dec 3, 2021, 4:09 AM IST

ETV Bharat / state

covid alert: రాష్ట్రంలో మరోసారి కొవిడ్​ అలజడి

రాష్ట్రంలో మరోసారి కొవిడ్‌ అలజడి మొదలైంది. నాలుగు నెలలుగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్‌ నెమ్మదిగా మళ్లీ జడలు విప్పుతోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ భారత్‌లోకి ప్రవేశించడంతో తిరిగి ఆందోళన ప్రారంభమైంది. కర్ణాటకలో తాజాగా రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణలోనూ ఆ జాడలు కనిపించే అవకాశాలున్నాయా? అనే భయం వెంటాడుతోంది. హైదరాబాద్‌ విమానాశ్రయంలో పరీక్షలను ముమ్మరం చేశారు.

covid alert: రాష్ట్రంలో మరోసారి కొవిడ్​ అలజడి
covid alert: రాష్ట్రంలో మరోసారి కొవిడ్​ అలజడి

రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తిపై మళ్లీ ఆందోళన నెలకొంది. కేసులు పెరుగుతాయనే అంచనాలు కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది జులై నుంచి రాష్ట్రంలో రెండోదశ ఉద్ధృతి క్రమేణా తగ్గుముఖం పడుతూ వస్తోంది. నెమ్మదిగా సాధారణ జనజీవనం మొదలై కొవిడ్‌ నిబంధనలపై శ్రద్ధ తగ్గింది. ఈ నిర్లక్ష్య ధోరణి కారణంగా.. గత 2 వారాలుగా క్రమేణా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికీ రోజుకు 180 నుంచి 200 వరకూ కొత్త కేసులు నమోదవుతుండడం ఆందోళనకర పరిణామమే. అంతరాష్ట్ర, అంతర్జాతీయ రాకపోకలు కొనసాగుతుండడం.. ఇదే సమయంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పొరుగు రాష్ట్రం కర్ణాటకలోకి ప్రవేశించడంతో.. ఇప్పుడు కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

వెంటాడుతున్న భయం

కర్ణాటకలో రెండు ఒమిక్రాన్‌ కేసుల నేపథ్యంలో.. తెలంగాణలోనూ ఆ జాడలు కనిపించే అవకాశాలున్నాయా? అనే భయం వెంటాడుతోంది. బుధవారం రెండు అంతర్జాతీయ విమానాల ద్వారా రాష్ట్రానికి వచ్చిన వారిలో తెలంగాణకు చెందిన వారు 239 మంది, ఏపీకి చెందిన వారు 72 మంది, మహారాష్ట్రకు చెందినవారు 10 మంది, మధ్యప్రదేశ్‌కు చెందినవారు ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక్కరు, రాజస్థాన్‌కు చెందిన ఒక్కరున్నారు. వీరి సమాచారాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ నుంచి ఇతర రాష్ట్రాల ఆరోగ్యశాఖలకు పంపించారు. బుధవారమే బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. మహిళను గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరీక్షల నమూనాలను జన్యుక్రమ పరిశీలన కోసం హైదరాబాద్‌ సీసీఎంబీకి పంపారు.

జిల్లా వైద్యాధికారికి..

సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కోటాచలం కొవిడ్‌ బారిన పడ్డారు. ఇటీవల ఆయన కుమారుడు విదేశాల నుంచి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులంతా తిరుపతికి వెళ్లి రెండు రోజుల క్రితం స్వగ్రామం తిరుమలగిరికి చేరుకున్నారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకోగా ఆరుగురికి కరోనా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం వీరంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. రెండురోజులుగా ఆయనను కలిసిన వారంతా ఆందోళన చెందుతున్నారు.

గురుకులాల్లో కరోనా కలకలం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామం మహాత్మా జ్యోతిబా ఫులె బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 27 మంది బాలికలకు, ముత్తంగిలో ఉన్న గురుకులంలో 47మంది వైరస్‌ బారినపడ్డారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గురుకుల పాఠశాలలో 9 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు వైద్యాధికారులు తేల్చారు. మల్యాల సర్కిల్‌లో ఓ ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు కొవిడ్‌ సోకింది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ముగ్గురు విద్యార్థినులు కరోనా బారినపడ్డారు.

ఇదీ చదవండి:

'బెంగళూరులో రెండు ఒమిక్రాన్‌ కేసులు.. మరో ఐదుగురికి..'

ABOUT THE AUTHOR

...view details