తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR REVIEW: ధాన్యం కొనుగోళ్లపై ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీయాలి: సీఎం కేసీఆర్​

ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీయాలని, వారి వైఖరిని ఎండగట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీలతో సుదీర్ఘంగా సమావేశమైన సీఎం... తదుపరి కార్యాచరణపై దిశానిర్ధేశం చేశారు. తప్పుదోవ పట్టించడంతో పాటు మొండిగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నేతలకు చెప్పినట్లు తెలిసింది.

By

Published : Dec 5, 2021, 3:55 AM IST

CM KCR REVIEW: ధాన్యం కొనుగోళ్లపై ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీయాలి: సీఎం కేసీఆర్​
CM KCR REVIEW: ధాన్యం కొనుగోళ్లపై ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీయాలి: సీఎం కేసీఆర్​

ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి పార్లమెంట్ ఉభయసభల్లో తెరాస సభ్యుల ఆందోళనలు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఖరారు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. మంత్రులు హరీశ్​ రావు, నిరంజన్ రెడ్డి, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్​సభ, రాజ్యసభ సభ్యులతో ప్రగతిభవన్​లో సీఎం ఎనిమిది గంటల పాటు భేటీ అయ్యారు. గత కొన్నాళ్లుగా కేంద్రంపై చేస్తున్న పోరాటం, పార్లమెంట్ వేదికగా నిరసనలు, ఇతర పార్టీల మద్దతు, తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

కేంద్రం వైఖరి దారుణం

కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, 75 ఏళ్లుగా దేశానికి వెన్నెముకగా నిలిచిన కీలకమైన వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని సీఎం కేసీఆర్ ఆక్షేపించినట్లు తెలిసింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుతోంటే... సరైన స్పందన కరువైందని అన్నారు. అడిగిన వాటిపై స్పందించకుండా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మళ్లీ పాత విషయాలనే తిప్పి చెప్పారని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రైతుల ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని యాసంగిలో ఎంత ధాన్యం కొంటారో, ఏడాదికి ఎంత మొత్తం కొంటారన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి అన్నట్లు తెలిసింది. మరోవైపు భాజపా రాష్ట్ర నేతలు మాత్రం రైతులను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించినట్లు సమాచారం.

తెలంగాణకు చేసిందేమీ లేదు..

దేశ ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చాలా విషయాల్లో మద్దతిచ్చామన్న ఆయన... తెలంగాణకు న్యాయం చేయాలన్న ఆలోచన మాత్రం వారికి లేదని అన్నట్లు సమాచారం. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని సమావేశంలో కేసీఆర్ అన్నట్లు తెలిసింది. కేంద్ర వైఖరిని ఎక్కడికక్కడే ఎండగట్టాల్సిన అవసరం ఉందన్న ఆయన... సోమవారం కూడా పార్లమెంట్ ఉభయసభల్లో మరోమారు ధాన్యం కొనుగోళ్ల అంశంపై పట్టుబట్టాలని చెప్పినట్లు సమాచారం.

సరైన స్పందన రాకపోతే..

కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన, సమాధానం రాకపోతే ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పారు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని ఎంపీలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. అవసరమైతే సమావేశాలకు దూరంగా ఉండి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలన్న ఆలోచనతో కూడా ఉన్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి ప్రస్తావించిన అంశాలపై తాను కూడా మీడియా సమావేశం నిర్వహిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశంలో ప్రస్తావించిన సీఎం... అన్ని చోట్లా పార్టీ అభ్యర్థులు గెలిచేలా చూడాలని ఎంపీలకు సీఎం సూచించారు.

ఇదీ చదవండి:

CM KCR review : ధాన్యం విషయంలో కేంద్ర వైఖరిపై సీఎం అసంతృప్తి...

ABOUT THE AUTHOR

...view details