తెలంగాణ

telangana

By

Published : Jul 11, 2020, 8:35 PM IST

Updated : Jul 11, 2020, 9:29 PM IST

ETV Bharat / state

రైతు బంధు అందని వారు ఎవరూ ఉండకూడదు: కేసీఆర్​

రైతుబంధు సాయం 99.9 శాతం రైతులకు అందిందని, మిగతా రైతులు కూడా ఎక్కడున్నా గుర్తించి అందరికీ అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్​లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

cm kcr review on agriculture in hyderabad
రైతు బంధు అందని వారు ఎవరూ ఉండకూడదు: కేసీఆర్​

రైతు బంధు అందని వారు ఎవరూ ఉండకూడదు: కేసీఆర్​

రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్​లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం... సంబంధిత అంశాలపై చర్చించారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేనప్పటికీ రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశంతో రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసిందన్న ముఖ్యమంత్రి... అధికారులు రైతులందరికీ సకాలంలో సాయం అందించారని అన్నారు.

99.9 శాతం మంది రైతులకు సాయం

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 99.9 శాతం మంది రైతులకు సాయం అందిందని తెలిపారు. ఇంకా ఎవరైనా రైతులు మిగిలిపోయినా, వెంటనే వారిని గుర్తించి రైతు బంధు అందించాలని ఆదేశించారు. సాయం అందరికి అందిందా? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అన్న విషయాలను నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, జిల్లాల్లో మంత్రులు వెంటనే తెలుసుకుని, వారికి డబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. యాజమాన్య హక్కుల విషయంలో చిన్నచిన్న సమస్యల వల్ల కొందరు రైతులకు సాయం అందడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

లక్ష్మాపూర్​కు అసలు రెవెన్యూ రికార్డే లేదు

మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్​కు అసలు రెవెన్యూ రికార్డే లేదని, ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి చొరవతో మొత్తం గ్రామంలో సర్వే జరిపిన ప్రభుత్వం ఏ భూమికి ఎవరు యజమానో నిర్ధారించిందని సీఎం తెలిపారు. రైతుబంధు సాయం ఎంత మందికి అందింది? ఇంకా ఎవరైనా మిగిలిరా? అన్న విషయాలపై క్లస్టర్ల వారీగా ఎంఈవోల నుంచి వెంటనే నివేదికలు తెప్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతుబంధు సమితుల ద్వారా కూడా వివరాలు తెప్పించాలన్నారు.

నియంత్రిత సాగు శుభసూచికం

భూముల క్రయవిక్రయాలు జరిగితే ఆ వివరాలను కూడా వెంటనే నమోదు చేయాలని సీఎం చెప్పారు. రైతులందరికీ రైతుబంధు సాయం అందించేందుకు ఎంత వ్యయం అయినా ప్రభుత్వం వెనుకాడదన్న ముఖ్యమంత్రి... సాయం అందించడానికి ఎలాంటి గడువు లేదని చెప్పారు. రాష్ట్రంలోని రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకే నియంత్రిత విధానంలో వానాకాలం పంటల సాగు చేస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. మొక్కజొన్న సాగు వద్దంటే ఎవరూ వేయలేదని, ఇది గొప్ప పరివర్తన అని అన్నారు. నియంత్రిత సాగు పూర్తిగా విజయవంతం కావడం గొప్ప పరిణామమన్న కేసీఆర్... రైతుల్లోని ఐక్యత, చైతన్యం భవిష్యత్​లో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది పలికిందని అభిప్రాయపడ్డారు.

దసరాలోగా రైతువేదికల నిర్మాణం పూర్తి చేయాలి

రైతులు పరస్పరం చర్చించుకోవడంతో పాటు వ్యవసాయాధికారులతో సమావేశం అయ్యేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా చేపట్టిన రైతువేదికల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. దసరాలోగా రైతువేదికల నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపాలని అన్నారు. రైతువేదికల నిర్మాణం పూర్తయితే, అవే రైతులకు రక్షణ వేదికలు అవుతాయని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన మేలు రకమైన, నాణ్యమైన విత్తనాల తయారీని వ్యవసాయ విశ్వవిద్యాలయం, విత్తనాభివృద్ధి సంస్థ చేపట్టాయని అన్నారు. తయారు చేసిన విత్తనాలను నిల్వ ఉంచేందుకు 25 కోట్ల రూపాయల వ్యయంతో అతి భారీ అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని, ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని సీఎం స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి.

Last Updated : Jul 11, 2020, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details