తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆక్సిజన్, రెమ్​డెసివర్, టీకా డోసులను ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి - సీఎం కేసీఆర్​ తాజా వార్తలు

రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్, రెమ్​డెసివర్, టీకా డోసులను ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల రోగులతో తెలంగాణపై భారం పడుతోందని ప్రధానమంత్రికి ఫోన్‌లో వివరించారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌, రెమ్​డెసివర్ ఔషధాలపై ఆరా తీసి.. నిల్వలు పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

cm kcr
సీఎం

By

Published : May 7, 2021, 3:57 AM IST

రాష్ట్రంలో ఆక్సిజన్‌, రెమ్​డెసివర్, ఔషధాల లభ్యతపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూలంకషంగా సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఫోన్లో మాట్లాడిన సీఎం... రాష్ట్రానికి కావాల్సిన టీకాలు, ఆక్సిజన్, రెమ్​డెసివర్ తక్షణమే సమకూర్చాలని అభ్యర్థించారు. తమిళనాడులోని శ్రీపెరంబదూరు, కర్ణాటకలోని బళ్లారి నుంచి కేటాయించిన ఆక్సిజన్ అందడంలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మెడికల్ హబ్‌గా మారిన హైదరాబాద్ పైనే వైద్య సేవల కోసం పొరుగు రాష్ట్రాల ప్రజలు ఆధారపడటం వల్ల.. రాష్ట్రంపై భారం పెరిగిపోయిందని సీఎం వివరించారు.

500 మెట్రిక్ టన్నులకు పెంచాలి

ప్రస్తుతం రోజుకు అందుతున్న 440 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను 500 మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరారు. రాష్ట్రానికి రోజుకు కేవలం 4వేల 900 రెమ్‌డెసివర్లు మాత్రమే అందుతున్నాయని... వాటిని కనీసం 25వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఇప్పటి వరకు 50 లక్షల టీకాల డోసులు అందించిందని... రాష్ట్ర అవసరాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రానికి ప్రతిరోజు రెండు నుంచి రెండున్నర లక్షల డోసులు సరఫరా చేయాలని మోదీని కోరారు. ప్రధాని ఆదేశాల మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సీఎం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆక్సిజన్‌ను కర్ణాటక, తమిళనాడు నుంచి కాకుండా తూర్పు రాష్ట్రాల నుంచి సరఫరా జరిగేలా చూస్తామని తెలిపారు.

చైనా నుంచి 12 క్రయోజనిక్ ట్యాంకర్లు

అనంతరం రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. రెమ్​డెసివర్ తయారీ సంస్థలతో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి వాటి లభ్యతను మరింతగా పెంచాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 9వేల 500 ఆక్సిజన్ వసతి కలిగిన పడకలు ఉన్నాయని... వారం రోజుల్లో మరో 5వేలు పెంచాలని అధికారులను ఆదేశించారు. కోటి రూపాయల చొప్పున వ్యయం చేసే 12 క్రయోజనిక్ ట్యాంకర్లను చైనా నుంచి వాయుమార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని చెప్పారు. ఐఐసీటీ డైరక్టర్ చంద్రశేఖర్‌తో ఫోన్లో మాట్లాడిన సీఎం... ఆక్సిజన్ నిల్వలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చంద్రశేఖర్ సూచనల మేరకు తక్షణమే 500 ఆక్సిజన్ ఎన్‌రిచర్‌లను కొనుగోలు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌, ఔషధాల కొరత రావొద్దని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

ప్రత్యేకాధికారిని నియమించాలి

రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ ఆస్పత్రులల్లో మొత్తం 5,980 కోవిడ్ అవుట్ పేషెంట్ సెంటర్లను ఏర్పాటు చేశామని... వాటి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. సెకండ్ వేవ్​లో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,56,000 పాజిటివ్ కేసులు నమోదుకాగా అందులో 85శాతం 1,30,000 మంది కోలుకున్నారని అధికారులు వివరించారు. రోజువారీగా కరోనా పరిస్థితిపై ప్రతిరోజూ సాయంత్రం వైద్యాధికారులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించాలని... పాజిటివ్ కేసులు, కోలుకున్న, హోం ఐసోలేషన్​​లో, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వివరాలను పబ్లిక్ డోమైన్లో ప్రదర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారిని నియమించాలని చెప్పారు.

నిధులను వెంటనే విడుదల చేయాలి

వైద్యశాఖకు అవసరమైన నిధులను వెంట వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందు కోసం ప్రత్యేకాధికారిని నియమించాలని తెలిపారు. మొదటి డోస్ టీకా వేసుకున్నవారికి నిర్ణీత సమయాన్ని అనుసరించి రెండో డోస్ వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయించి పరిసరాల పరిశుభ్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలని సూచించారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళన గురికావద్దని ముఖ్యమంత్రి కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా పరీక్షల కోసం ఆందోళన చెందకుండా ప్రభుత్వం అందించే.. కొవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలని చెప్పారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా ఇంటింటికీ కిట్లను అందచేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:రెమ్‌డెసివిర్‌ రవాణా చేస్తున్న విమానం క్రాష్‌ ల్యాండింగ్‌

ABOUT THE AUTHOR

...view details