తెలంగాణ

telangana

ETV Bharat / state

నష్టదాయకమనే వ్యతిరేక ధోరణి మారాలి: సీఎం కేసీఆర్‌ - సీఎం కేసీఆర్​ తాజా వార్తలు

భారతీయ జీవిక, దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం లాభదాయకమైనది కాదనే వ్యతిరేక ధోరణిలో మార్పు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రగతి భవన్‌లో గురువారం నాబార్డు ఛైర్మన్‌ జి.ఆర్‌.చింతల ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందంతో సీఎం సమావేశమై, వ్యవసాయ రంగ అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

నష్టదాయకమనే వ్యతిరేక ధోరణి మారాలి: సీఎం కేసీఆర్‌
నష్టదాయకమనే వ్యతిరేక ధోరణి మారాలి: సీఎం కేసీఆర్‌

By

Published : Aug 28, 2020, 6:31 AM IST

భారతీయ జీవిక, దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం లాభదాయకమైనది కాదనే వ్యతిరేక ధోరణిలో మార్పు రావాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు. భారతదేశానిది వ్యవసాయాధారిత ఆర్థికవ్యవస్థ కావడం వల్లే ఆటుపోట్లు తట్టుకుని నిలబడుతోందని పేర్కొన్నారు. రైతులు సామూహిక వ్యవసాయం చేసేలా ప్రోత్సహించడంతో పాటు పంటలు ప్రాసెస్‌ చేసి అమ్మేందుకు అవసరమైన యంత్రాలను అందించాలన్నారు.

ప్రగతి భవన్‌లో గురువారం నాబార్డు ఛైర్మన్‌ జి.ఆర్‌.చింతల ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందంతో సీఎం సమావేశమై, వ్యవసాయ రంగ అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడంతో పాటు విదేశాలకు అవసరమయ్యే ఆహార పదార్థాలు అందించే స్థాయికి చేరాలని కేసీఆర్‌ ఆకాక్షించారు. దేశంలో ఎక్కువ మంది ఆధారపడుతున్న, అందరికీ ఆహారాన్ని అందించడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన ముడిసరకును అందిస్తున్నది వ్యవసాయ రంగమేనని, దీనికి మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలని పేర్కొన్నారు. వ్యవసాయాభివృద్ధికి కృషి చేయడంతో పాటు వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, నాబార్డు లాంటి సంస్థలు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని సీఎం కోరారు.

స్వయం సమృద్ధి సాధించాలి

‘దేశంలోని 135 కోట్ల మందికి అన్నం పెట్టేది రైతులే. వ్యవసాయంపై ఆధారపడి 15 కోట్ల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇంత జనాభా కలిగిన దేశానికి ప్రపంచంలో మరో దేశమేదీ తిండిపెట్టలేదు. అందుకే దేశం ఆహారోత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి. వివిధ దేశాల్లో ఆహార అవసరాలు గుర్తించి, మన దేశం నుంచి ఎగుమతి చేసే విధానం రావాలి. ఈ మేరకు నాబార్డు అధ్యయనం చేయాలి’ అని సీఎం తెలిపారు.

దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలి

‘దేశంలో రకరకాల భూభాగాలు ఉన్నాయి. కొండ ప్రాంతాలు, శీతల ప్రాంతాలు, సముద్రతీర ప్రాంతాలు. ఏ ప్రాంతానికి ఏ పంటలు అనువైనవో గుర్తించి వాటితో సాగు చేయించేందుకు దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలి. పంటల మార్పిడి విధానం అవలంబించాలి. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగితే చాలదు. ఆ మేరకు మార్కెటింగ్‌ విధానం ఉండాలి. వ్యవసాయాధారిత పరిశ్రమలు పెంచాలి. అలాగే రైతులు సంఘటిత వ్యవసాయంతో పెట్టుబడులు తగ్గించుకుని, ఆదాయం పెంచుకునేలా ప్రోత్సహించాలి. సామూహిక వ్యవసాయంతో పాటు సంఘటితంగా రైతులు ఆహార ఉత్పత్తులను వినిమయ వస్తువులుగా మార్చి అమ్మితే ఎక్కువ లాభాలు గడించేందుకు అవకాశముంది’ అని అన్నారు.

ఆహారశుద్ధికి చేయూతనివ్వాలి

‘రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఆహార శుద్ధి సెజ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరముంది. సెజ్‌లు, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక చేయూత అందించే పథకాలు, కార్యక్రమాలను నాబార్డు రూపొందించాలి. మరోవైపు వ్యవసాయ రంగం కూలీల కొరత ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభ నివారణకు యాంత్రీకరణ జరగాలి. ఈ యంత్రాల కొనుగోలుకు అవసరమైన ఆర్థిక సహాయం, రాయితీలు అందించాలి’ అని సీఎం సూచించారు.

ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, దయాకర్‌రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సహకార బ్యాంకు ఛైర్మన్‌ రవీందర్‌రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'

ABOUT THE AUTHOR

...view details