తెలంగాణ

telangana

స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు

By

Published : Aug 31, 2020, 8:03 AM IST

కరోనాతో టూర్స్‌ బంద్ అయ్యాయి. జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఛేంజ్‌ కోరుకుంటున్నారు. వ్యవసాయ క్షేత్రాల సందర్శనకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ‘ఫామ్‌టూర్స్‌’ పేరుతో పొలం బాట పడుతున్నారు. ప్రకృతి మధ్య గడిపేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. తమ పిల్లలకు సాగును పరిచయం చేయడానికి వ్యవసాయక్షేత్రాల వైపు అడుగులు వేస్తున్నారు.

FARM TOUR
FARM TOUR

కరోనాతో సరదాలు.. షికార్లు దూరమయ్యాయి. కొద్దిసేపు ఉపశమనం పొందేందుకు మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఇటువంటి సమయంలోనే నగర ప్రజలు ప్రకృతి ఆస్వాదనకు మొగ్గుచూపుతున్నారు. స్వచ్ఛమైన గాలి.. మట్టివాసనలను ఈతరం పిల్లలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయక్షేత్రాల వైపు అడుగులు వేస్తున్నారు. పూలు, పండ్లమొక్కలు.. ఆకట్టుకునే పరిసరాలు.. కొండకోనల్లో స్వచ్ఛంగా పారే సెలయేళ్ల మధ్య ఇంటిల్లిపాదీ సేదతీరుతున్నారు. తమ బిడ్డలకు మట్టిలోని గొప్పతనాన్ని.. వ్యవసాయంలోని హుందాతనాన్ని పరిచయం చేయటం ద్వారా తల్లిదండ్రులు గొప్ప అనుభూతికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు విద్యావంతులు పచ్చదనాన్ని పరిచయం చేయడాన్నే వృత్తిగా మలచుకుంటున్నారు. అటువంటి వ్యవసాయక్షేత్రమే.. కమ్యూనిటీ సపోర్ట్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ (సీఎస్‌ఏ).

వంద ఎకరాల్లో వ్యవసాయ దర్శనం

షాద్‌నగర్‌ సమీపంలోని భీమారంలో 250 మంది రైతులు కలిసి వంద ఎకరాల విస్తీర్ణంలో సేంద్రియ వ్యవసాయంతో సామూహిక సాగుకు శ్రీకారం చుట్టారు. వీరు చేస్తున్న ప్రయోగాలు.. అనుసరిస్తున్న సాగు పద్ధతులతో వ్యవసాయంవైపు కొత్తతరం మొగ్గుచూపుతోంది. ఎంతోమంది రైతులకు ఇప్పుడిది శిక్షణ కేంద్రంగా మారింది. ఇలాంటి క్షేత్రాన్ని సందర్శించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుండటంతో సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో సేదతీరామనే అనుభూతి కలిగించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పిల్లలు, పెద్దల కోసం ప్రత్యేకంగా అంశాలకు రూపకల్పన చేశారు.

వైవిధ్య పంటలతో..

అగ్రో ఫారెస్ట్‌ మోడల్‌ విధానంలో ఇక్కడ సాగు చేస్తున్నారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలంలో దిగుబడి ఇచ్చే పంటలను ప్రధానంగా సాగు చేస్తున్నారు. స్వల్పకాలంలో పండే కూరగాయలు సాగుచేస్తూనే.. 20 రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. దానిమ్మ, జామ, డ్రాగన్‌, సీతాఫలం సహా కాలానుగుణంగా దొరికే పండ్ల మొక్కలను నాటారు. ఇక దీర్ఘకాలంలో ఆదాయం కోసం శ్రీగంధం మొక్కలను నాటారు. ఇక్కడే గోశాల ఉండటంతో పొలాలకు సేంద్రియ ఎరువులనే వాడుతున్నారు.

పండగ చేద్దామని...

"వ్యవసాయం గౌరవప్రదమైన వృత్తిగా అందరూ గుర్తించేలా చేయడమే మా ప్రయత్నం. 2015లో స్నేహితులు, మరికొందరితో కలిసి వంద ఎకరాలు కొని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. సామూహికంగా వ్యవసాయం చేయగల్గితే ఖర్చులు తగ్గి గిట్టుబాటు పెరుగుతుందని ఈ ప్రయత్నం మొదలెట్టాం. భాగస్వామ్య రైతులు వారాంతాలు, పండగల సమయంలో వచ్చి ఇక్కడ గడుపుతుంటారు. ఇటీవల మా క్షేత్రంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమికి మంచి స్పందన వచ్చింది. దీన్ని చూసి ఫామ్‌టూర్స్‌ ఏర్పాటు చేయవచ్చు కదా అని కొందరు అడిగారు. పిల్లలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించేలా ‘ఫామ్‌ టూర్స్‌’ ప్రారంభించాం. వచ్చిన వారికి ఉదయం, మధ్యాహ్నం సంప్రదాయ రుచులతో టిఫిన్‌, భోజనం ఉంటుంది. మున్ముందు వ్యవసాయక్షేత్రంలో బస చేసే అవకాశమూ కల్పించబోతున్నాం.’’

- శ్రీనివాసరావు కండ్లకుంట

ABOUT THE AUTHOR

...view details