ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. తీరొక్కపూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల నడుమ ఆటాపాటలతో ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారని సీఎం సూచించారు. తెలంగాణ ప్రజల జీవనంలో భాగమైపోయిన ప్రకృతి పండుగ బతుకమ్మ, నేడు ఖండాంతరాలకు విస్తరించడం గొప్పవిషయమన్నారు.
తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ విశ్వవ్యాప్త గుర్తింపును తెచ్చిందన్నారు. బతుకమ్మను పల్లె పల్లెనా జరుపుకొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు కుంటలు నీటితో నిండి వున్నాయని.. బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మహిళలు పండగను ఆనందోత్సాహాలతో, కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలని గవర్నర్ తమిళిసై సూచించారు.