Chandrayangutta flyover inauguration: హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట పైవంతెనను హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీనే వంతెన ప్రారంభం కావాల్సి ఉండగా.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు, పాతబస్తీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజుకు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు మహమూద్ అలీ లాంఛనంగా ఈ వంతెనకు శ్రీకారం చుట్టారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో పాటు పలువురు ఎంఐఎం నేతలు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
Hyderabad News Today : ఈ సందర్భంగా రూ.45.79 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వెళ్లేందుకు ప్రయాణం సులభతరం కానుందని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.
4 లైన్లు.. 674 మీటర్ల పొడవు..: ఇక్కడి చౌరస్తాలోని ఒక కూడలిపై 2007లోనే పైవంతెనను ప్రారంభించారు. మరోవైపున్న బంగారు మైసమ్మ దేవాలయ కూడలిలో ట్రాఫిక్ కష్టాలు పెరగడంతో పాత వంతెనను పొడిగించాలని బల్దియా నిర్ణయించింది. ఇందుకు జీహెచ్ఎంసీ 2020లో శ్రీకారం చుట్టింది. పనులు తాజాగా పూర్తవడంతో హోంమంత్రి మహమూద్ అలీ నేడు ప్రారంభించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వెళ్లేందుకు ఈ పైవంతెన ఉపయోగపడనుంది. రూ.45 కోట్ల 79 లక్షల వ్యయంతో రెండు వైపుల 4 లైన్లతో 674 మీటర్ల పొడవుతో ఈ ఫ్లై ఓవర్ను నిర్మించారు.
ఇక ఆగకుండా వెళ్లిపోవచ్చు..: కందికల్ గేట్, బర్కాస్ జంక్షన్ల వద్ద ఆగకుండా నేరుగా ఈ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్లిపోవచ్చు. ఓవైసీ జంక్షన్ మీదుగా ఎల్బీనగర్ వరకు.. ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ వైపు సకాలంలో చేరేందుకు వీలుకానుంది. ఎస్ఆర్డీపీ ద్వారా నగరంలో నలువైపులా జీహెచ్ఎంసీ 41 పనులు చేపట్టింది. చాంద్రాయణగుట్ట పైవంతెనతో ఇప్పటికే 30 పనులు పూర్తికాగా.. మరో 11 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు.. మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం కోసం నగరంలో అవసరమైన చోట పైవంతెనలు, అండర్ పాస్లు, ఆర్ఓబీలను.. ప్రభుత్వం దశల వారీగా అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే.