తెలంగాణ

telangana

ETV Bharat / state

రంగు పరీక్ష తరవాతే బియ్యం సేకరణ.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

Color Testing of Rice: కొందరు దళారులు గ్రామాల వారీగా రేషన్ బియ్యం సేకరించి మిల్లర్లకు విక్రయిస్తున్నారు. వారు కాస్త నాణ్యంగా ఉన్న బియ్యాన్ని ఎఫ్​సీఐకి చేరుస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం రీసైకిల్ దందాకు చెక్ పెట్టింది. దీని కోసం రంగు పరీక్ష నిర్వహించడాన్ని తప్పనిసరిచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

By

Published : Jan 7, 2022, 7:26 AM IST

Color Testing of Rice
రంగు పరీక్ష తరవాతే బియ్యం సేకరణ

Color Testing of Rice: రేషన్‌ బియ్యం రీసైకిల్‌ దందాకు ఇకపై అడ్డుకట్ట పడనుంది. కస్టం మిల్లింగ్‌ రైస్‌ పథకం కింద మిల్లర్లు ఇచ్చే బియ్యానికి రంగు పరీక్ష(కలర్‌ టెస్ట్‌) నిర్వహించడాన్ని తప్పనిసరిచేసింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగు వచ్చిన బియ్యం లాట్లను మాత్రమే స్వీకరించాలని ఎఫ్‌సీకి ఇచ్చిన మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పంట కాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుచేసి మిల్లర్లకు ఇస్తాయి. మిల్లర్లు వాటిని బియ్యంగా మార్చి కేంద్ర కోటా(సెంట్రల్‌ పూల్‌)కిందభారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)కు ఇస్తారు.ఇక్కడే కొందరు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని సేకరించి, గోనె సంచులను మార్చి వాటినే ఎఫ్‌సీఐకి ఇస్తున్నారు. సాధారణంగా ఎఫ్‌సీఐ వద్ద కనీసం మూడు సంవత్సరాలకు సరిపడా నిల్వలు ఉంటాయి. ఈ క్రమంలో బియ్యానికి పురుగు పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధ్యయనం చేసిన కేంద్రం రీసైకిల్డ్‌ బియ్యమే దానికి కారణమని గుర్తించింది. వాటికి అడ్డుకట్ట వేసేందుకు రంగు పరీక్ష విధానాన్ని తాజాగా ఆవిష్కరించింది. ఈ విధానాన్ని అమలుచేయటం ద్వారా రీసైకిల్డు బియ్యానికి చెక్‌ పెట్టాలన్నది కేంద్రం వ్యూహంగా ఉంది.

40 శాతం వరకు రీసైకిల్డ్‌ బియ్యమే: రాష్ట్రంలో సుమారు 92 లక్షల రేషన్‌కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తోంది. వాటిల్లో 80% వరకు తినేందుకు వినియోగించడం లేదన్నది అనధికారిక అంచనా. అవన్నీ దళారుల వద్దకు చేరుతున్నాయి. కొందరు దళారులు గ్రామాల వారీగా సేకరించి మిల్లర్లకు విక్రయిస్తున్నారు. వాటిల్లో కొంత కోళ్లు, చేపలు తదితరాల దాణా కోసం వినియోగిస్తుండగా, కాస్త నాణ్యంగా ఉన్నవి సీఎమ్మార్‌ పథకం కింద ఎఫ్‌సీఐకి చేరుతున్నాన్నాయి. ఎఫ్‌సీఐకి ఇచ్చే బియ్యంలో అటూఇటుగా 40 శాతం వరకు రీసైకిల్డువేనని కేంద్రం అంచనా వేసింది.

ఇలా నిర్ధారిస్తారు

రంగు పరీక్షలో భాగంగా మిథైల్‌ రెడ్‌, బ్రోయోథైమోల్‌ బ్లూ, ఇథైల్‌ ఆల్కహాల్‌, శుద్ధ జలం మిశ్రమాన్ని కేశనాళికలో వేస్తారు. ఆ ద్రావణంలో అయిదు గ్రాముల బియ్యాన్ని వేసి నిముషం పాటు ఉంచితే రంగు మారతాయి. ఆ రంగు ఆధారంగా బియ్యం మిల్లింగ్‌ చేసి ఎంత కాలమవుతుందనేది నిర్ధారిస్తారు. కేంద్రం మార్గదర్శకాలను బియ్యం సేకరణ సమయంలో అమలుచేస్తామని ఎఫ్‌సీఐ అధికారి తెలిపారు.

  • ఆకుపచ్చ రంగు: నెలలోపు మిల్లింగ్‌ చేసినట్లు
  • లేత(అవకాడో) ఆకుపచ్చ: 1 - 2 నెలలు
  • పసుపు: మూడు నెలలు
  • పసుపుతో కూడిన నారింజ: నాలుగు నెలలు
  • నారింజ: అయిదు నుంచి ఆరు నెలలు

ఇదీ చూడండి:'ఈ నెల 30 తర్వాత ఉచిత రేషన్​ నిలిపివేత'

ABOUT THE AUTHOR

...view details