రాష్ట్రానికి రుణాలపై ఊరట లభించింది. బహిరంగ మార్కెట్ నుంచి రూ.4,000 కోట్ల రుణ సేకరణకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో 13 ఏళ్ల కాలపరిమితితో మంగళవారం బాండ్ల వేలానికి ఆర్బీఐ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (జూన్ వరకూ) రూ.11 వేల కోట్ల రుణాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నా.. ఎఫ్ఆర్బీఎం నూతన నిబంధనల పేరుతో కేంద్రం గత రెండు నెలలూ అనుమతివ్వని విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని అడహక్ (తాత్కాలిక) విధానంలో ఈ రుణం సేకరణకు కేంద్రం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ వెలుపల కార్పొరేషన్లు, సంస్థల ద్వారా తీసుకునే రుణాలను సైతం ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తెస్తామని కేంద్ర ఆర్థికశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. దీంతో పాటు గత రెండేళ్లుగా బడ్జెట్ వెలుపల తీసుకున్న రుణాలను కూడా కలిపి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బీఎం పరిమితిని నిర్దేశిస్తామని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయా రుణాలపై వివరాలు కోరింది. అది తేలేవరకూ మార్కెట్ నుంచి రుణాల సేకరణను నిలిపివేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. పాత విధానాన్ని కొనసాగించాలని కోరింది. దీనిపై లేఖలు రాయడంతో పాటు రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని వివరించి రుణాలకు అనుమతివ్వాలని కోరారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కేంద్రం నిబంధనలకు అంగీకరించి కొత్త రుణపరిమితి మేరకు రుణాలు పొందుతుండగా.. పాత నిబంధనలే కొనసాగించాలని తెలంగాణ కోరుతుండటంతో ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుతం రుణ సేకరణకు అనుమతించినా.. ఏ అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది, ఈ ఏడాది ఎంత రుణపరిమితి ఉంటుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదని అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ అంశం ఓ కొలిక్కిరావచ్చని చెబుతున్నారు.
కొంత ఊరట..