తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2020, 9:56 AM IST

ETV Bharat / state

నగరంలో పెరుగుతున్న గృహహింస కేసులు

లాక్​డౌన్​ వేళ గృహిణులపై వేధింపులు పెరుగుతున్నాయి. సాధారణ రోజులతో పోల్చితే నగర పరిధిలో ఇటీవల 10-15 శాతం ఫిర్యాదులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పిల్లల ఎదుటే గొడవ పడడం పసి మనసులపై ప్రభావం చూపుతుందని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Causes of Increased Domestic Violence in the hyderabad City
నగరంలో పెరుగుతున్న గృహహింస కేసులు

మంచు కురిసే దేశాల్లో కొంతకాలం కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. కోపాలు, చికాకులు పెరుగుతాయి. తనను ఎదుటివారు నిర్లక్ష్యం చేస్తున్నారనే అనుమానంతో నిత్యం గొడవలు జరుగుతుంటాయి. దీన్నే ‘కేబిన్‌ ఫీవర్‌’ అంటారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో అధిక శాతం కుటుంబాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. 40 శాతం గృహహింస కేసులు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి’ అని మనస్తత్వ నిపుణురాలు డాక్టర్‌ పూర్ణిమ చెబుతున్నారు.

గృహిణులకు సవాల్‌..

కుటుంబ సభ్యులందరూ ఒకేచోట ఉండటం గృహిణులకు సవాల్‌ అంటారు మానసిక విశ్లేషకురాలు మహాలక్ష్మి. కొన్ని కుటుంబాల్లో సహకరించే భర్త, పిల్లలు ఉంటారు. ఎక్కువ మంది.. భారమంతా ఆమెపై వేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. భాగస్వామిని సాధించేందుకు భర్తలు మాటలతో వేధించటమే కాదు.. మాట్లాడకుండా ఉంటూ మానసిక హింసకు గురి చేస్తున్నారంటూ ఆమె విశ్లేషించారు.

కుటుంబ సభ్యులపై చిరాకు..

భావోద్వేగాలను నియంత్రించుకోలేక కుటుంబ సభ్యులపై చిరాకును ప్రదర్శిస్తున్న ఘటనలు మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిర్యానీ సరిగా లేదని భర్త చేసిన గోలకు.. ఓ మహిళ పిల్లలతో పుట్టింటికి బయల్దేరిన విషయాన్ని ఓ మహిళా వైద్యురాలు పంచుకున్నారు. ఖాళీ సమయంలో అశ్లీల వెబ్‌సైట్లు చూస్తూ సహచరిని వేధిస్తున్న ప్రబుద్ధులు ఉన్నారని ఓ వైద్య నిపుణుడు తెలిపారు.

నగరంలో పరిస్థితి ఇదీ..

సికింద్రాబాద్‌లోని దివ్యదిశ సఖి కేంద్రానికి కొద్ది రోజుల వ్యవధిలో 19 ఫిర్యాదులు అందాయి. వీరిలో ఒక మహిళ తానే స్వయంగా కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇద్దరు గృహిణులకు వసతి కల్పించారు. మరో ఇద్దరు బాధితులను ప్రాణాపాయ పరిస్థితుల నుంచి రక్షించారు. మహిళా హెల్ప్‌లైన్‌ నంబరు 181 ద్వారా ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని సఖి కేంద్ర పరిపాలన విభాగ అధికారిణి రోహిణి తెలిపారు. గృహహింస అనుభవిస్తున్న మహిళలు, యువతులు హెల్ప్‌లైన్‌ 181, సఖి కేంద్రం 040- 27714881 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని ఆమె సూచించారు.

ఇదీ చూడండి :వాణిజ్య వాహనాల పన్ను చెల్లింపుపై అయోమయం

ABOUT THE AUTHOR

...view details