రైతుబంధు పథకం కింద సొమ్ము పంపిణీ చేయాల్సిన రైతుల జాబితాలను వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది. ఈ పథకాన్ని 2018 వానాకాలం(ఖరీఫ్) సీజన్ నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. తొలిసారి ఎకరానికి రూ.4 వేలు ఇచ్చింది. 2019 వానాకాలం నుంచి ఎకరానికి రూ.5 వేలు రైతు బ్యాంకు ఖాతాలో వేస్తున్నారు. 2018-21 మార్చి వరకూ 6 పంట సీజన్లకు మొత్తం రూ.35,911 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఈ ఏడాది(2021-22)లో వానాకాలం, యాసంగి(రబీ) సీజన్లలో కలిపి మొత్తం రూ.14,800 కోట్లు ఇస్తామని బడ్జెట్లో నిధులు కేటాయించింది. గత యాసంగిలో 59,25,725 మంది రైతుల ఖాతాల్లో రూ.7,400 కోట్లను వ్యవసాయశాఖ జమ చేసింది. ఇప్పుడు రైతుల సంఖ్య 60 లక్షలకు చేరవచ్చని ప్రాథమిక అంచనా. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటిదాకా లక్షన్నర మంది భూముల యజమానులు రైతుబంధు నిధులు తీసుకోవడం లేదు. ఈ పథకం కింద నిధులు అందాలంటే ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలివ్వాలి. లక్షన్నర మంది దాకా ఇవ్వడం లేదు. ఈ సీజన్లో ప్రతీ రైతు నుంచి మళ్లీ వివరాలు సేకరించాలని గ్రామ స్థాయిలో ఉండే వ్యవసాయ విస్తరణ అధికారులకు(ఏఈవోలకు) వ్యవసాయశాఖ సూచించింది. కొత్త రైతులు తోడయితే ఈ పథకం కింద అందజేయాల్సిన మొత్తం పెరుగుతుంది. అలాగే భూ విక్రయాల తర్వాత యజమానుల పేర్లు మారాల్సి ఉంటుంది. ఈ రకంగా 2021 జనవరి నుంచి జూన్ 10 వరకూ భూ యజమాన్య పత్రాల్లో పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ జాబితాలోకి మారిన రైతుల పేర్లను కూడా సేకరిస్తారు. వివరాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ తాజాగా రెవెన్యూ శాఖను అడిగింది.
జూన్ 15 నుంచి 25లోగా...
రైతుల తాజా జాబితాలను రెవెన్యూశాఖ నుంచి తీసుకుని జూన్ 10కల్లా జాతీయ సమాచార కేంద్రానికి(ఎన్ఐసీకి) వ్యవసాయశాఖ అందజేస్తుంది. ఎకరంలోపు రైతులు, 2 ఎకరాల్లోపు ఉన్నవారు, 3 ఎకరాల్లోపు ఉన్నవారు...ఇలా భూమి విస్తీర్ణం వారీగా రైతుల జాబితాలను సిద్ధం చేస్తారు. 11వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా నిధుల జమకు ఏర్పాట్లు చేస్తారు. జూన్ 15 నుంచి 25లోగా ఒక్కోరోజు లక్షల మందికి జమ చేస్తారు. నిధుల లభ్యతను బట్టి ఏ రోజు ఎంత మందికి వేయాలనేది ఆర్థికశాఖ నిర్ణయిస్తుంది.