తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.2వేల కోట్లతో విద్యాపథకం: మంత్రివర్గ ఉపసంఘం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధిపై హైదరాబాద్​ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఉప సంఘం చర్చించింది. ఏడాదికి రూ.2000 కోట్లతో బృహత్తర విద్యా పథకం అమలు చేయనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది.

By

Published : Apr 8, 2021, 4:56 PM IST

Updated : Apr 8, 2021, 5:17 PM IST

cabinet sub committee
మంత్రివర్గ ఉపసంఘం

కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామని... ఇందుకోసం ఏడాదికి రూ.2000 కోట్లతో బృహత్తర విద్యా పథకం అమలు చేయనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ఉపసంఘ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఎం ఆలోచనలకు అనుగుణంగా

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను అధికారులు సమావేశంలో వివరించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంగ్ల మాధ్యమంలో గురుకులాలను ఏర్పాటు చేశారన్న సబ్ కమిటీ... నాణ్యమైన విద్య అందినప్పుడే మానవవనరుల అభివృద్ధి చెందుతాయన్న సీఎం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో విద్యారంగంలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.

విద్యారంగాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతాం

ప్రభుత్వ విద్యావ్యవస్థపై నమ్మకం కలిగించాలన్న ఆలోచనతో నాణ్యమైన విద్య అందించేందుకు ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఉపసంఘం పేర్కొంది. బంగారు తెలంగాణ లక్ష్యసాధన కోసం విద్యావిధానాన్ని ఒక సాధనంగా చేసుకొని ముందుకెళ్తామని... ప్రాథమిక విద్యారంగం పటిష్టతతోనే ఉన్నతవిద్య సమర్థంగా అమలవుతుందన్నది ప్రభుత్వ భావన అని తెలిపింది. రాష్ట్రంలో పాఠశాల విద్యారంగాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నామని... సామాజిక అభివృద్ధి దృక్పథంతో విద్యారంగంపై అధికనిధులు ఖర్చు చేయబోతున్నట్లు మంత్రులు తెలిపారు.

నూతన భవనాలు, తాగునీరు, డిజిటల్ తరగతులు

అవసరమైన అదనపు గదులు, నూతన భవనాలు, తాగునీరు, డిజిటల్ తరగతుల లాంటి మౌలిక సదుపాయాలు సంపూర్ణంగా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు వివరించారు. ఏటా రెండు వేల కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదలకు తుది మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాటిని ముఖ్యమంత్రికి నివేదిస్తామని, సీఎం తుదినిర్ణయం మేరకు బృహత్తర విద్యాపథకం పనులు ప్రారంభమవుతాయని మంత్రులు వివరించారు.

ఇదీ చదవండి:సామూహిక పంచాంగ శ్రవణం వద్దు.. నిరాడంబరంగానే ఉగాది వేడుకలు

Last Updated : Apr 8, 2021, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details