తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడే కేబినెట్ సమావేశం

కొత్త పురపాలక చట్టం బిల్లు నేడు కేబినెట్ ఆమోదం పొందనుంది. ప్రగతి భవన్​లో సాయంత్రం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో బిల్లుతో పాటు గతంలో తీసుకున్న వివిధ నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, పురపాలక ఎన్నికలు సహా ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

By

Published : Jul 17, 2019, 5:53 AM IST

Updated : Jul 17, 2019, 7:06 AM IST

కేబినెట్

ఈరోజు సాయంత్రం ప్రగతిభవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. నూతన పురపాలక చట్టానికి సంబంధించిన బిల్లుకు ఆమోదముద్ర ప్రధాన ఎజెండాగా కేబినెట్ భేటీ జరగనుంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చాకే.. పురపాలక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... శాసనసభ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. రేపు, ఎల్లుండి అసెంబ్లీ... 19న మండలి సమావేశం కానున్నాయి.

మంత్రుల ముందుకు బిల్లు..

నూతన పురపాలక చట్టానికి సంబంధించిన బిల్లుపై ఇవాళ కేబినెట్​లో చర్చించి ఆమోదం తెలపనున్నారు. గతంలో ఉన్న తెలంగాణ పురపాలక చట్టం 1965, తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం- 1994 స్థానంలో తెలంగాణ పురపాలక చట్టం- 2019 బిల్లు ముసాయిదాను రూపొందించారు. ఈ బిల్లు ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం ముందుకు రానుంది. బిల్లుపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదిస్తారు. నూతన చట్టం ఉద్దేశం, లక్ష్యాలను ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులకు వివరించనున్నారు.

ఆర్డినెన్స్​లకు ఆమోదం..

ఇటీవల తీసుకొచ్చిన వివిధ ఆర్డినెన్స్​ల స్థానంలో బిల్లులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. బోధనాసుపత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంపు, జిల్లా, మండల ప్రజాపరిషత్​ల మొదటి సమావేశ తేదీలను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీపై చర్చిస్తారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో వార్డుల సంఖ్యను ఖరారు, రుణవిమోచన కమిషన్ ఛైర్మన్​గా ఇతరులను నియమించేలా వెసులుబాటుకు సంబంధించిన ఆర్డినెన్స్​ల స్థానంలో బిల్లులకు ఆమోదం తెలపనున్నారు.

'పుర'పోరుపై దిశానిర్దేశం..

పట్టణ ప్రాంతాల్లో సమీకృత టౌన్​షిప్​ల నిర్మాణానికి కొత్త విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో టౌన్​షిప్​లను నిర్మించే యోచనలో సర్కారు ఉంది. భాషాపండితులు- పీఈటీలకు పదోన్నతులు, గ్రామీణ నీటి సరఫరా విభాగంలో కొత్త పోస్టులు, వివిధ న్యాయస్థాల్లో కొత్త పోస్టులను మంజూరు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. పురపాలక ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. పురపోరుకు సంబంధించి మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో వాతావరణ- వర్షాభావ పరిస్థితులు, కాళేశ్వరం ద్వారా నీటి ఎత్తిపోత, నూతన సచివాలయ, శాసనసభ భవన సముదాయాల నిర్మాణం, ప్రస్తుత సచివాలయ కార్యాలయాల తరలింపు సహా ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు రాజకీయ పరిణామాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.

కేబినెట్ సమావేశం

ఇవీ చూడండి: ముంబయిలో భవనం కూలి 11 మంది మృతి

Last Updated : Jul 17, 2019, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details