తెలంగాణ

telangana

అధికారంలో ఉన్నారని దేశాన్ని అడ్డంగా దోచుకుంటారా?: కె.కేశవరావు

By

Published : Feb 6, 2023, 6:48 PM IST

Adani issue debated in Parliament: దేశ రాజకీయాల్లో ఓ కుదుపు కుదిపేస్తున్న అదానీ వ్యవహారంపై బీఆర్​ఎస్​ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు స్పందించారు. అదానీ, మోదీ ఇద్దరూ స్నేహితులు కాబట్టే.. పార్లమెంటులో చర్చ జరగడంలేదని ఆరోపించారు. దిల్లీలోని మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. అధికారంలో ఉన్నారని దేశాన్ని అడ్డంగా దోచుకుంటారా? అని ప్రశ్నించారు. అదానీ అంత వేగంగా ఎలా ప్రపంచ కుబేరుడయ్యారో విచారణ జరపాలని కేశవరావు డిమాండ్​ చేశారు.

Kesha Rao
Kesha Rao

Adani issue debated in Parliament: పార్లమెంటులో అదానీ అంశం చర్చ జరిగితే అదానీ షేర్లు భారీగా పడిపోతాయని బీజేపీ భయపడుతోందని బీఆర్​ఎస్​ పార్లమెంటరీ పార్టీ పక్ష నేత కే కేశవరావు మండిపడ్డారు.. అదానీ అంశంపై పార్లమెంటులో చర్చకు బీజేపీ భయపడుతోందని ఆరోపించిన ఆయన.. అదానీ.. మోదీ స్నేహితుడు కాబట్టే పార్లమెంటులో చర్చ జరపడం లేదని దుయ్యబట్టారు. దిల్లీలోని మీడియా సమావేశంలో మాట్లాడిన కేశవరావు.. ఎల్‌ఐసీ ద్వారా అదానీకి రూ.వేల కోట్ల మేలు చేశారని ఆరోపించారు.

అదానీకి పరిమితంగానే రుణాలు ఇచ్చామని ఇప్పుడు ఎల్‌ఐసీ చెబుతోందని పేర్కొన్న కేకే.. పరిమితంగానైనా అక్రమాలు చేయవచ్చా అని ఎద్దేవా చేశారు. అదానీకి మేలు చేసేందుకు ఇతర పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారని ఆరోపించిన ఆయన.. పారిశ్రామికవేత్తలను ఈడీ, సీబీఐ పేరిట కేంద్రం బెదిరిస్తోందని మండిపడ్డారు. అదానీ అంత వేగంగా ఎలా ప్రపంచ కుబేరుడయ్యారో విచారణ జరపాలని డిమాండ్​ చేసిన కేశవరావు.. అధికారంలో ఉన్నారని దేశాన్ని అడ్డంగా దోచుకుంటారా? అని ప్రశ్నించారు.

"ప్రజాస్వామ్యంలో ఏ అంశంపైనైనా చర్చించవచ్చు. పార్లమెంటులో చర్చ జరిగితే అదానీ షేర్లు పడిపోతాయని భయపడుతున్నారు. అదానీ అంశంపై చర్చే జరగకూడదని బీజేపీ భావిస్తోంది. అదానీకి ప్రభుత్వం అండగా నిలుస్తోంది."-కె. కేశవరావు, బీఆర్​ఎస్​ ఎంపీ

Debate in Parliament on Adani issue: మరోవైపు అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై పార్లమెంట్​లో చర్చ జరపాలని విపక్షాలు.. సోమవారం కూడా డిమాండ్ చేశాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని పట్టుబట్టాయి. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్​ జగ్​దీప్​ ధన్​ఖడ్​ తోసిపుచ్చారు. దీంతో ఉభయసభలు గందరగోళంగా మారాయి.

తొలుత మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడిన ఉభయసభలు.. మళ్లీ ప్రారంభమైనా ఎటువంటి మార్పులేదు. దీంతో మంగళవారం ఉదయానికి ఉభయసభలు వాయిదా వేస్తున్నట్లు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్​ జగ్​దీప్​ ధన్​ఖడ్​ ప్రకటించారు.

అదానీ గ్రూప్​ మార్కెట్ విలువ సగానికి పతనం:మరోవైపు హిండెన్​బర్గ్​ ఇచ్చిన నివేదికతో అదానీ గ్రూప్​ మార్కెట్ విలువ భారీగా నష్టపోయింది. షేర్​ మార్కెట్​లో సంస్థ విలువ​ సగానికి పైగా పతనమైంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీని గత ఏడు సెషన్లలో పరిశీలిస్తే.. అదానీ ఎంటర్​ప్రైజైస్ షేరు విలువ​ సుమారు 54 శాతం నష్టపోయింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details