హైదరాబాద్కి చెందిన వాసుదేవ్ ఎనిమిదేళ్ల కుమార్తె తలసేమియా బాధితురాలు. పదిహేను రోజులకొకసారి ఆమెకి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. లాక్డౌన్ మొదలయ్యాక బిడ్డకోసం రక్తం సంపాదించే సరికి ఆ తండ్రికి చుక్కలు కనపడ్డాయి. ఎప్పుడూ వెళ్లే బ్లడ్ బ్యాంకుతో సహా మరో మూడు బ్లడ్బ్యాంకులు వాళ్లకు కావాల్సిన గ్రూపు రక్తం లేదని చేతులెత్తేశాక ఏం చేయాలో తెలియని ఆ తండ్రి సోషల్ మీడియాలో స్నేహితులను అభ్యర్థించాడు. మూడు రోజులపాటు ఎందరినో సంప్రదించాక చివరికి ఓ వ్యక్తి పోలీసుల అనుమతి తీసుకుని సొంత వాహనంలో తానే వచ్చి రక్తం ఇచ్చి వెళ్లగలనని హామీ ఇచ్చాక వాసుదేవ్ ఊపిరి పీల్చుకున్నాడు.
మార్చిలో లాక్డౌన్ మొదలయ్యాక వారం పది రోజులకల్లా బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోవడం మొదలైంది. పెద్ద పెద్ద రక్త నిధుల్లో రోజూ వంద మందికి పైగా రక్తదానం చేస్తే, చిన్న చిన్న వాటిల్లోనూ రోజుకు ఐదారుగురైనా వచ్చి రక్తం ఇచ్చేవారు. లాక్డౌన్ వల్ల దాతలెవరూ రాకపోవడంతో ఒక్కసారిగా సేకరణ జీరో అయిపోయింది. ఒకప్పుడు నెలకు 500 యూనిట్లు సరఫరా చేసే బ్లడ్ బ్యాంకులు కూడా 150 యూనిట్లు మాత్రమే సరఫరా చేయగలిగాయి. దాంతో అత్యవసరమైన కేసులకు మాత్రమే రక్తం ఇవ్వడం మొదలెట్టాయి. అరుదైన గ్రూపుల రక్తం అయితే పూర్తిగా అందుబాటులో లేకుండా పోయింది. దీనివల్ల తలసేమియా బాధితులూ డయాలిసిస్ అవసరం ఉన్నవారూ చాలా ఇబ్బందులు పడ్డారు.
అయితే సమస్య మరీ తీవ్రం కాకముందే బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులూ స్వచ్ఛంద సంస్థలూ సమయానికి స్పందించి సమస్యను అధికారుల దృష్టికి తేవడంతో వెంటనే రక్తదానానికి ఏర్పాట్లు జరిగాయి. రక్తదాతల్ని పోలీసు వాహనాల్లో తీసుకెళ్లి తిరిగి ఇంటి దగ్గర దింపే ఏర్పాటుచేయడంతో చాలామంది ముందుకు వచ్చారు. దాంతో హైదరాబాదులో బ్లడ్బ్యాంకులన్నీ పూర్తిగా కాకపోయినా కొంతవరకూ సర్దుబాటు చేసుకోగలిగాయి. కానీ మిగిలిన నగరాల్లో అలా జరగలేదు.
కొరత ఉంది!
కోల్కతాలో నివసించే ఇరవై ఏడేళ్ల శ్రేయ కూడా తలసేమియా బాధితురాలే. ఏప్రిల్ మొదటివారంలో తాను ఎప్పుడూ వెళ్లే బ్లడ్బ్యాంకుకు వెళ్తే లాక్డౌన్ వల్ల దాతలు ఎవరూ రాలేదనీ ఆమె గ్రూపు రక్తం లేదనీ చెప్పారు. దాంతో కంగారుపడిన శ్రేయ వరసగా నగరంలో ఉన్న బ్లడ్ బ్యాంకులన్నిటికీ ఫోన్లు చేసింది. రెండు రోజులు ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడిపాక చివరికి పరిచయస్తుల ద్వారా ప్రయత్నిస్తే ఓ బ్లడ్ బ్యాంకు నిర్వాహకులు ఆమె కోసం ప్రత్యేకంగా దాతను పిలిపించి రక్తం ఏర్పాటుచేశారు. ముంబయి, దిల్లీ లాంటి నగరాల్లో శ్రేయ లాంటి వాళ్లెంతమందో సమయానికి రక్తం దొరక్క ఆందోళన చెందారు. చిన్న చిన్న పట్టణాల్లో అయితే డయాలిసిస్ రోగులు రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయిన వార్తలూ వచ్చాయి.
వారాల తరబడి లాక్డౌన్ అనేది అందరికీ కొత్తే. దాని పరిణామాలపై ఎవరికీ అవగాహన లేదు. దాంతో బ్లడ్ బ్యాంకులూ సమస్యని ముందుగా ఊహించలేకపోయాయి. ఇంటినుంచి బయటకు వెళ్లడానికి అనుమతి లేకపోవడంతో రక్తదాతలూ ఊరకుండిపోయారు. ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్లుంటారేమోనన్న భయమూ దానికి తోడవటంతో ఎప్పుడూ రక్తదానం చేసేవారు కూడా గత రెండు నెలల్లో రక్తదానం చేయడానికి వెనకాడారు. ఫలితంగా చాలా చోట్ల రక్తం కొరత ఏర్పడింది. కాకపోతే కరోనా వైరస్ బాధితులకు తప్ప మరే ఇతర చికిత్సలూ, శస్త్రచికిత్సలూ జరగకపోవటం వల్లా రోడ్డు ప్రమాదాలు లేకపోవడం వల్లా రక్తం అవసరం పెద్దగా రాక సమస్య గురించి అంతగా ఎవరికీ తెలియలేదు. అయితే రక్తం నిల్వల సమస్యకి లాక్డౌన్ కూడా పూర్తి కారణం కాదనిపిస్తోంది. ఎందుకంటే లాక్డౌన్ ప్రకటించడానికి మూడు రోజుల ముందే మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి ఓ సందర్భంలో మాట్లాడుతూ రక్తం నిల్వలు లేవనీ, దాతలు ముందుకు రావాలనీ కోరారు. ఒడిశా, పశ్చిమ్ బంగా తదితర రాష్ట్రాల్లోనూ రక్తం కొరత ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ఎప్పుడూ సమస్యే
నిజానికి మనదేశంలో రక్తం కొరత సమస్య ఇప్పటిది కాదు, ఎప్పుడూ ఉన్నదేనట. ఆ మధ్య లాన్సెట్ పత్రిక ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మన దేశంలోనే రక్తం కొరత ఎక్కువగా ఉంది. ఏకంగా నాలుగు కోట్ల పది లక్షల యూనిట్ల కొరత ఉందనీ మరో పక్క డిమాండు దీనికన్నా 400 శాతం ఎక్కువనీ ఆ నివేదిక చెబుతోంది. మొత్తంగా ప్రపంచ దేశాలన్నిట్లో కలిపి పది కోట్ల యూనిట్ల కొరత ఉంటే అందులో నాలుగు కోట్లు ఒక్క మన దేశంలోనే ఉందన్నమాట. రక్తదానం చేసే సామర్థ్యం ఉన్న ప్రతి వెయ్యి మందిలోనూ 85 మంది రక్తదానం చేస్తే రక్తం కొరత ఉండదు. అయితే ఇక్కడ 31 మంది మాత్రమే చేస్తున్నారట. దీని ప్రభావం వల్ల సమయానికి రక్తం అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తగినంత ఆరోగ్యవంతమైన రక్తం ఒంట్లో లేక నిస్సత్తువగా రోజులు గడుపుతున్నారు. దాని ఫలితం వ్యక్తిగత, కుటుంబ జీవితాలమీదే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడుతోంది.
రక్తదానం ప్రాణదానమే!
మనిషి... సాటి మనిషికి ఇచ్చే వెలకట్టలేని బహుమతి- రక్తం. దానివల్ల ప్రాణాలనే నిలబెట్టవచ్చు. ఒక్కరి ప్రాణమే కాదు, దాన్ని ఎర్రరక్తకణాలు, ప్లాస్మా తదితర భాగాలుగా విడగొట్టడం ద్వారా ఒక యూనిట్ రక్తంతో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. పుట్టుకతో వచ్చే కొన్నిరకాల సమస్యల వల్ల కొందరికి రక్తం సరిగా తయారు కాదు. హిమోగ్లోబిన్ సరిగా ఉండని తలసేమియా బాధి తులకీ, రక్తం గడ్డకట్టని హీమోఫీలియా బాధితులకీ నిరంతరం ఇతరుల నుంచి తీసుకున్న తాజా రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు జరిగేటప్పుడు రోగికి సగటున వంద యూనిట్ల వరకూ రక్తం అవసరమవుతుంటుంది. ఇవి కాకుండా ఇంకా శస్త్రచికిత్సలప్పుడూ, కాన్పుల సమయంలోనూ, ప్రమాదాల్లో గాయపడినప్పుడు తీవ్ర రక్తస్రావమైతే... అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వస్తుంది. మన దేశంలో ఏటా కొన్ని కోట్ల పెద్ద ఆపరేషన్లూ, లక్షలాది క్యాన్సర్ చికిత్సలూ జరుగుతున్నాయి. ఇక రోడ్డు ప్రమాదాలైతే ఏకంగా రోజుకు కొన్ని వందలు. పైన చెప్పిన రక్తం కొరత లెక్కల్ని బట్టి చూస్తే ఇలాంటి అవసరాల్లో ఉన్నవారు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారనే అర్థం.
దాతలు కావాలి!
రక్తాన్ని ప్రయోగశాలలో తయారుచేయలేం కాబట్టి రక్తం కావాలంటే దాతలు ముందుకు రావాల్సిందే. కానీ సాధారణ ప్రజానీకంలో చాలామందికి రక్తదానం పట్ల ఎన్నో అపోహలు. తమ ఆరోగ్యానికి ఎక్కడ ముప్పొస్తుందోనని భయపడి దూరంగా ఉండేవారే ఎక్కువ. అవగాహనతో ముందుకొచ్చినవారే మళ్లీ మళ్లీ రక్తదానం చేస్తుంటారు. అనారోగ్యం వల్ల కుటుంబంలో ఎవరికైనా రక్తం ఎక్కించాల్సిన అవసరం వచ్చినప్పుడే చాలామందికి రక్తదానం విలువ తెలుస్తోంది. అయినా ఆ అవసరం గడిచాక దాని గురించి మర్చిపోయేవారే ఎక్కువ. చాలా తక్కువ మంది మాత్రమే గుర్తుంచుకుని ఆ దిశగా తమ వంతు కృషిచేస్తున్నారు.
తండ్రిని చూసి...: హైదరాబాద్లోని కొన్ని ప్రధాన ఆస్పత్రుల్లో అత్యవసరంగా రక్తం కావాలంటే గబుక్కున గుర్తొచ్చే పేరు బంటీ. చార్మినార్ ప్రాంతంలో ఉండే ఈ యువకుడు మూత్రపిండాలు పాడైపోయిన తండ్రికోసం తన రక్తం ఇచ్చేవాడు. ఆస్పత్రుల్లో రక్తం అవసరమూ బాధితులు పడే అవస్థా కొన్ని సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూసినవాడు కావడంతో తండ్రి మరణించినా రక్తదానం చేసే తన అలవాటును అలాగే కొనసాగించాడు. తానూ తన కుటుంబమే కాక కొన్ని వేలమంది సభ్యులతో రక్తదాతల సైన్యాన్నే తయారుచేశాడు. ‘బీయింగ్ హ్యూమన్ ఏక్ ఉమీద్’ పేరుతో ఫేస్బుక్ పేజీ పెట్టి పదిహేను వేల మందిని ఒక వేదిక మీదికి చేర్చాడు.
ఎక్కడ ఎప్పుడు ఎవరికి రక్తం కావాలన్నా మేమున్నామంటూ ఈ బృంద సభ్యులు వాలిపోతారు. ఇలాంటి వారి చొరవ వల్లే 2800 మంది సభ్యులున్న హైదరాబాదులోని తలసేమియా సొసైటీ రక్తం కొరత రాకుండా చూసుకోగలుగుతోంది.