రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) విరుచుకుపడ్డారు. హైదరాబాద్ సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. ఇంటెలిజెన్స్, హోంమంత్రి ఏమయ్యారో కేసీఆర్ (CM KCR) చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర వాటాలేని సంక్షేమ పథకాలు ఏంటో సీఎం చెప్పాలన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని చెప్పారు. కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా దక్కడంతో ప్రజల్లో విశ్వాసం వచ్చిందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత అమిత్ షాను కేసీఆర్ కలిశారని తెలిపారు. మేయర్ పదవి భాజపాకే ఇస్తామని అమిత్ షాతో అన్నట్లు బండి సంజయ్ చెప్పారు.
హైదరాబాద్ నగర శివారు దమ్మాయిగూడలో మూడేళ్ల చిన్నారిపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడం అత్యంత అమానుషమని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రస్తుతం బాధిత చిన్నారని ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోందని అయన అవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగి మూడు రోజులైనా నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచార నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెరాస పాలనలో హత్యలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయని.. దోషులు యథేచ్ఛంగా తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.