తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP Jan Sampark Abhiyan in TS : 'జన్ సంపర్క్ అభియాన్'​.. అస్త్రంగా రాష్ట్ర బీజేపీ వ్యూహం - When is BJP Jan Sampark Abhiyan program

BJP Jan Sampark Abhiyan in telangana : తెలంగాణలో కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం పడకుండా.. కాషాయ దళం అప్రమత్తమైంది. కేంద్రంలో మోదీ సర్కార్‌ అధికారం చేపట్టి 9ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జన్ సంపర్క్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ క్రమంలో రాష్ట్ర పార్టీ ఈ జన్ సంపర్క్‌ను వేదికగా చేసుకుని విస్తృతంగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించింది.

Etv Bharat
Etv Bharat

By

Published : May 20, 2023, 8:15 AM IST

బీజేపీ జన్ సంపర్క్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు

BJP Jan Sampark Abhiyan in telangana : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలనాథులకు.. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తీవ్ర సంకట స్థితిని తెచ్చిపెట్టాయి. ఈ ఫలితాలతో బీజేపీలోకి చేరికలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలు చేజారిపోకుండా ఉండేలా రాష్ట్ర పార్టీ నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. కర్ణాటక ఫలితాల ప్రభావం నుంచి పార్టీ శ్రేణుల దృష్టి మరల్చేందుకు.. నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనను అస్త్రంగా చేసుకోవాలని నిర్ణయించింది. జన్‌సంపర్క్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ అధిష్ఠానం ఆదేశించింది.

BJP Jan Sampark Abhiyan in telangana news : ఇందులో భాగంగా తెలంగాణలో జన్‌సంపర్క్‌ను అభియాన్‌ను మరింత క్రీయశీలకంగా నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. తద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడంతో పాటు.. పార్టీని బలోపేతం చేసుకోవచ్చని అంచనావేసింది. ఈనెల 30 నుంచి జూన్ 30వ వరకు నెల రోజుల పాటు కార్యక్రమాలను రూపొందించుకుంది. అన్ని జిల్లాలు, మండలాలు, శక్తి కేంద్రాలు, బూత్​లు, అన్ని లోక్ సభ నియోజక వర్గాల్లో.. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 51 భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుంటే.. తెలంగాణలోనే 2 సభలు నిర్వహించనుంది.

"దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అన్ని స్థాయిల్లోనూ ఈ సమావేశాలు జరుగుతాయి. వీటి ముఖ్య ఉద్దేశం జనంలోకి వెళ్లడమే. 23, 24 రోజుల్లో జిల్లా స్థాయిలో సమావేశాలు.. 25, 26తేదీల్లో మండల స్థాయి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తాం. ఈ నెల 30న ప్రధాని మోదీ ర్యాలీ నిర్వహించి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాం." - యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ సీనియర్‌ నేత

దక్షిణాదిన పాగా వేయాలని భావించిన కమలం పార్టీ లక్ష్యానికి కర్ణాటకలో ఓటమితో ఎదురుదెబ్బ తగిలినట్లైయింది. కర్ణాటక చేజారినప్పటికీ.. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోంది. అక్కడ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టిన అగ్ర నేతలు.. ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. జన్ సంపర్క్ అభియాన్​లో భాగంగా నెలలోనే రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. జాతీయ పార్టీ అధినేత జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు రాష్ట్ర నాయకత్వం తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో పలు సభలు నిర్వహించారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా.. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో నిర్వహించిన సభలకు జేపీ నడ్డా హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details