Laxman Fires On TS Government: రాష్ట్రంలో సక్రమంగా పన్నులు కట్టి, తప్పు చేయనివారు.. ఐటీ దాడులపై భయమెందుకు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. సాధారణంగా జరిగే ఐటీ దాడులకు టీఆర్ఎస్ నేతలు రాజకీయాన్ని ముడిపెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక టీఆర్ఎస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కక్షతోనే బీఎల్ సంతోష్ను ఇబ్బంది పెడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు.
ప్రభుత్వం ఎవరో నలుగురి పేర్లు పెట్టుకుని కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న లక్ష్మణ్.. తాము రాజకీయంగా, న్యాయంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జీవనోపాధికి వచ్చిన 26 కులాలను ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించిందని దుయ్యబట్టారు. తూర్పు కాపు, కొప్పుల వెలమ వంటి కులాలను తొలగించారని పేర్కొన్నారు. ఈ 26 కులాల పూర్వీకులు 50 ఏళ్ల క్రితమే హైదరాబాద్లో స్థిరపడ్డారని చెప్పారు. ఉత్తరాంధ్ర కావడం వల్లే వారిని జాబితా నుంచి తొలగించారని విమర్శించారు. తొలగించిన 26 కులాలను బీసీ జాబితాలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఆ 26 కులాలను తిరిగి బీసీల్లో చేర్చుతామని స్పష్టం చేశారు. ఈ 26 కులాలను ప్రభుత్వం బీసీ జాబితాలోకి చేర్చేవరకు బీజేపీ పోరాటం ఆగదని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు.