తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Dec 20, 2023, 9:09 AM IST

ETV Bharat / state

బీజేపీ శాసనసభాపక్షనేత ఎవరో? - ఎంపికపై అధిష్ఠానం దృష్టి

BJP LP Leader in Telangana : రాష్ట్ర బీజేపీ శాసనసభా పక్షనేత ఎంపికపై అధిష్ఠానం దృష్టి కేంద్రీకరించింది. మూడు రాష్ట్రాల ముఖ్య మంత్రుల ఎంపిక తంతు ముగియడంతో ఎల్పీనేతను ఎంపిక చేసే పనిలో జాతీయ నాయకత్వం పడింది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఎల్పీ నేతను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్పీ నేత రేసులో రాజాసింగ్‌, కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరిని ఎల్పీని చేస్తారనే ఉత్కంఠ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో నెలకొంది.

BJP High Command Focus on State BJP LP Leader
BJP LP Leader in Telangana

బీజేపీ శాసనసభాపక్షనేత ఎవరో? - ఎంపికపై అధిష్ఠానం దృష్టి

BJP LP Leader in Telangana :రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చెందిన 8 మంది అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఈ నెల 9 నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభంకావడంతో ఎల్పీనేత లేకుండానే సమావేశాలకు హాజరయ్యారు. సభలో లేవనెత్తాల్సిన అంశాలపై గట్టిగా గళం విప్పేందుకు సమస్యలపై అవగాహన ఉన్న సీనియర్‌ ఎమ్మెల్యేను ఎల్పీనేతగా ఎంపిక చేయాల్సి ఉంటుంది.

BJP High Command Focus on State BJP LP Leader: తెలంగాణతో పాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు ఎన్నికలు జరగగా ఆ మూడు రాష్ర్టాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలో నిమగ్నమైన జాతీయ నాయకత్వం తెలంగాణ ఎల్పీ నేత ఎంపికపై దృష్టి కేంద్రీకరించలేకపోయింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల ఎంపిక ప్రక్రియ ముగియడంతో తెలంగాణపై అధిష్ఠానం దృష్టి పెట్టింది. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత శాసనసభపక్ష నేతను ప్రకటించనున్నట్లు సమాచారం.

Telangana BJP LP Leader :బీజేపీ శాసనసభాపక్ష నేత బరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. గోషామహల్‌ నుంచి ఎమ్మెల్యేగా మూడు సార్లు విజయం సాధించిన రాజాసింగ్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై కామారెడ్డి నుంచి గెలుపొందిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

లోక్​సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవు : కిషన్‌రెడ్డి

రాజాసింగ్‌కు గత శాసనసభలో ఎల్పీనేతగా పని చేసిన అనుభవం ఉంది. పార్టీకి విధేయుడిగా ఉండటం మూడు సార్లు వరుసగా విజయం సాధించడం రాజాసింగ్‌కు ఉన్న అనుకూలతలుగా చెప్పుకోవచ్చు. రాజాసింగ్‌ను ప్రతికూలతలు కూడా వెంటాడుతున్నాయి. తెలుగుభాషపై పట్టులేకపోవడం, హిందుత్వ ఎజెండా, గోషామహల్‌ నియోజకవర్గానికి మాత్రమే పరిమితంకావడం గ్రామీణ స్థాయి సమస్యలపై అవగాహన లేకపోవడం వంటి అంశాలు ఇబ్బందిగా ఉన్నాయి.

BJP MLA Raja Singh in BJP LP Leader Post List :రాజాసింగ్‌కు ఎల్పీ నేతగా ఇవ్వని పక్షంలో కామారెడ్డి నుంచి విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి అవకాశం కల్పించనున్నట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. వెంకటరమణారెడ్డి కామారెడ్డి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తాజా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు. ఇద్దరు ఉద్దండులపై విజయం సాధించి రాష్ట్ర ప్రజలతో పాటు జాతీయ నాయకత్వం చూపు తనవైపునకు తిప్పుకున్నారు. ఇది కాటిపల్లికి కలిసి వచ్చే అవకాశం. గతంలో జడ్పీ ఛైర్మన్‌గా చేసిన అనుభవంతో పాటు మోదీపై తనుకున్న అభిమానం అంతా ఇంతా కాదు.

గవర్నర్ ప్రసంగం చూస్తే ఆరు గ్యారెంటీల అమలుపై అనుమానాలు వస్తున్నాయి : ఎంపీ లక్ష్మణ్

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మొక్కవోని విశ్వాసంతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూనే తన సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలతో మెలిగారు. ప్రజా సమస్యలపై అపార అనుభవం, ప్రశ్నించేతత్వం కాటిపల్లి వెంకటరమణారెడ్డికి ఉంది. ఒక వేళ పార్టీ అధ్యక్షుడిని మారిస్తే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని చేయాలని కాషాయ శ్రేణులు కోరుకుంటున్నాయి.

BJP MLAs Compete for Legislative Party Leader Post :ఈ పరిస్థితుల్లో కాటిపల్లిని ఎల్పీ నేతను చేసే అవకాశం లేకపోలేదు. రాజస్థాన్‌లో తొలిసారి ఎమ్మెల్యే అయిన నేతకు ముఖ్యమంత్రిగా బీజేపీ అవకాశం కల్పించింది. దీన్నిబట్టి చూస్తే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని ఎల్పీనేతగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. రాజాసింగ్‌ మాత్రం ఈ సారి కూడా ఎల్పీనేతగా తనకే అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక సీట్లే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఎల్పీనేత ప్రక్రియను ముగించాలని భావిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాలంటే శాసనసభలో ప్రజా సమస్యలపై గళమెత్తే సమర్థవంతమైన నాయకుడు అవసరం. అందులో ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న వాదనను ప్రజల్లో నుంచి తొలగించి, బీజేపీపై విశ్వాసం కల్పించడం ముందున్న కర్తవ్యంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎల్పీ నేత కూడా అనేక సవాళ్లు ఎదుర్కొనాల్సి ఉంటుంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఎవరు అవుతారోనని కాషాయ శ్రేణులతో పాటు రాజకీయ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు.

పార్లమెంట్​పై దాడి ఘటన - బీజేపీని చులకన చేయడానికే : బూర నర్సయ్య గౌడ్

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది : రఘునందన్‌రావు

ABOUT THE AUTHOR

...view details