Bhatti Vikramarka Respond to ED Notices Kavitha: దిల్లీ మద్యం కుంభకోణంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఇదే విషయంపై ప్రతి చోట చర్చ జరుగుతోందని.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అతలాకుతలం చేస్తోందని తెలిపారు. అవినీతిని రూపుమాపుతామని కేజ్రీవాల్ పార్టీ పెట్టారని గుర్తు చేశారు. కానీ ఆప్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. దేశంలో ఏ పార్టీ చేయలేనంత అవినీతిని కేజ్రీవాల్ చేశారని.. దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అన్నాహజారే ఎక్కడున్నారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. దిల్లీ మద్యం కుంభకోణంపై అన్నాహజారే మాట్లాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలసీకి మంత్రివర్గం ఆమోదం ఉండాల్సిందేనని పేర్కొన్నారు. సిసోడియా రాజీనామా చేయడం కాదని.. మంత్రివర్గం మొత్తం బాధ్యత తీసుకుని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా రాజీనామా చేయాలని తెలిపారు. మద్యం కేసుకు తెలంగాణకు ఏం సంబంధమని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
కవితకు ఈడీ నోటీసులిస్తే.. తెలంగాణ ఆత్మ గౌరవం ఎలా దెబ్బతింటుంది: కవితకు ఈడీ నోటీసులిస్తే.. తెలంగాణ ఆత్మ గౌరవం ఎలా దెబ్బతింటుందని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అక్రమాలు చేసి.. తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని కొందరు చూస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దని డిమాండ్ చేశారు. ఈ నెల 16 నుంచి.. తన పాదయాత్ర మొదలవుతుందని వెల్లడించారు. పాదయాత్రకు ఇంకా రూట్మ్యాప్ సిద్దం కాలేదని తర్వాత పూర్తి వివరాలు చెబుతానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బెదిరించిన అంశాన్ని ఎవరూ సమర్థించరని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
"అవినీతిని రూపుమాపుతామని కేజ్రీవాల్ పార్టీ పెట్టారు. ఆప్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. దేశంలో ఏ పార్టీ చేయలేనంత అవినీతిని కేజ్రీవాల్ చేశారని దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. అన్నాహజారే ఎక్కడున్నారు..? దిల్లీ మద్యం కుంభకోణంపై అన్నాహజారే మాట్లాడాలి. ప్రభుత్వ పాలసీకి మంత్రివర్గం ఆమోదం ఉండాల్సిందే. కవితకు నోటీసులిస్తే తెలంగాణ ఆత్మ గౌరవం ఎలా దెబ్బతింటుంది." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత