తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదంలో క్షౌర వృత్తిదారులు - lock down effect on barbers

చేతిలో కత్తెర ఆడితేనే ఇంట్లో పూటగడిచే పరిస్థితి వారిది. లాక్​డౌన్​తో నెల రోజుల నుంచి పనిలేక అవస్థలు పడుతున్నారు నాయీబ్రాహ్మణులు. షాపులు మూతపడడం వల్ల కత్తెర ఆడడం.. దువ్వెన పట్టడం ఆగిపోయింది. ప్రస్తుతం వారి దగ్గర నిత్యావసర సరకులు కొనేందుకు కూడా డబ్బులు లేవు. కుటుంబ పోషణ భారంగా మారిపోయింది. నెలరోజులుగా ఇంటికే పరిమితమైన క్షౌరవృత్తిదారులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు.

barber problems in telangana
ప్రమాదంలో క్షౌరవృత్తిదారులు

By

Published : Apr 23, 2020, 12:30 PM IST

నాయీబ్రాహ్మణుల్లో 90 శాతం మంది కులవృత్తి మీదే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో 17,500 క్షౌరశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 50 వేల మంది వరకు పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 వేల దుకాణాల ద్వారా రెండు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ విద్యార్హతలు ఉన్నవాళ్లు కూడా రుసుముల చెల్లింపు, వసతిగృహాల అద్దెల కోసం క్షౌరవృత్తి చేస్తున్నారు.

అద్దెల కోసం ఒత్తిడి

సెలూన్స్ నడిపే వారిలో అత్యధికులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని దుకాణాలు పెట్టుకున్నారు. ఇప్పుడు కిస్తీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలూన్లు గత నాలుగు వారాలుగా మూతబడ్డాయి. క్షౌరవృత్తిదారులు ఇంటికే పరిమితమయ్యారు. సెలూన్లలో పనిచేసే వారిలో ఎక్కువ శాతం అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. అద్దెల కోసం ఒత్తిడి పెరిగిందని వాపోతున్నారు.

దాతల సాయంతో ఆహారం

కరెంట్ బిల్లులు, నిత్యావసర సరకులు కొనుగోలు చేయడం ప్రస్తుతం ఇబ్బందికరంగా మారిందంటున్నారు. తమ దీనావస్థను గమనించి దాతలు.. ఆహార ప్యాకెట్లు అందజేస్తే.. వాటితో పొట్ట నింపుకుంటున్నామని చెబుతున్నారు. తిన్న తర్వాత.. తర్వాతి రోజు పరిస్థితి ఆలోచిస్తేనే నిద్ర పట్టడంలేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని చేతులెత్తి మొక్కుతున్నారు.

ఇవీచూడండి:విషాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details