తెలంగాణ

telangana

By

Published : May 9, 2021, 7:07 PM IST

ETV Bharat / state

బ్యాంక్​ ఉద్యోగులపై కరోనా పంజా.. పనివేళలు కుదించాలని విజ్ఞప్తి

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పట్ల బ్యాంకు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సుమారు 8 వేలకు పైగా ఉద్యోగులు వైరస్​ బారినపడటం, 35 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం వారిని భయాందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్యాంకు పనివేళలు కుదించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ.. తాజాగా వయసుతో నిమిత్తం లేకుండా ఉద్యోగులందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

corona effect on banking sector
corona effect on banking sector

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. వైరస్​ తీవ్రత బ్యాంకింగ్​ రంగంపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. బ్యాంకులకు వచ్చే ఖాతాదారులతో నేరుగా సంబంధాలు కలిగిన బ్యాంకర్లు.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్​ బారిన పడుతూనే ఉన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నెల 7 వరకు రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు చెందిన సుమారు 8,762 మంది ఉద్యోగులకు మహమ్మారి సోకగా.. 35 మంది కొవిడ్​ కాటుకు బలైనట్లు బ్యాంకు యూనియన్‌ నాయకులు తెలిపారు.

వైరస్​ బాధితుల్లో అత్యధికంగా ఎస్బీఐ ఉద్యోగులు 3,945 మంది ఉండగా.. యూనియన్‌ బ్యాంకు ఉద్యోగులు 986 మంది, బ్యాంక్​ ఆఫ్‌ ఇండియా ఉద్యోగులు 245 మంది, కెనరా బ్యాంకు ఉద్యోగులు 947 మంది, ఇండియన్‌ బ్యాంకు ఉద్యోగులు 96 మంది, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఉద్యోగులు 679 మంది, ఇండియన్‌ ఓవర్సీస్​ బ్యాంకు ఉద్యోగులు 112 మంది, బ్యాంక్​ ఆఫ్‌ బరోడా 724 మంది, యుకో బ్యాంకు 53 మంది, ఇతర బ్యాంకుల్లో మరో 975 మంది ఉద్యోగులు ఉన్నట్లు ఇండియన్‌ బ్యాంక్​ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు.

పని వేళలు కుదించాలి..

కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇటీవల అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు.. కరోనాకు సంబంధించి పలు అంశాలను చర్చించారు. బ్యాంకుల పనివేళలు కుదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేేేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఖాతాదారులకు సేవలు అందుబాటులో ఉండేట్లు చూడాలని, సాయంత్రం 4 గంటలకు బ్యాంకులు పూర్తిగా మూసివేసే విధంగా సమయాలను సవరించాలని గత నెల 21న ప్రభుత్వాన్ని కోరారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని బ్యాంకు యూనియన్ల ప్రతినిధులు తెలిపారు.

ఉద్యోగులందరికీ వ్యాక్సిన్​ ఇవ్వాలి..

మరోవైపు కరోనా బారినపడుతోన్న ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున వయస్సుతో నిమిత్తం లేకుండా ఉద్యోగులందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 7న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రభుత్వానికి లేఖ రాసింది. వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని.. ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా ఉద్యోగులందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా వారిలో ధైర్యాన్ని నింపొచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు.

ఎస్బీఐ క్వారంటైన్​ కేంద్రాలు..

ఇదిలా ఉండగా.. వైరస్​ బాధితుల్లో సగం మంది భారతీయ స్టేట్‌ బ్యాంకుకు చెందిన ఉద్యోగులే ఉండటంతో ఆ బ్యాంకు యాజమాన్యం.. రెండు తాత్కాలిక క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గచ్చిబౌలి, సికింద్రాబాద్​లలో ఉన్న శిక్షణా కేంద్రాలను క్వారంటైన్‌ సెంటర్లుగా మార్చింది. తీవ్రత అధికంగా ఉన్న వారిని ఇక్కడికి తరలించి.. బ్యాంకు వైద్యులతో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే 40 బెడ్ల వరకు అందుబాటులోకి తెచ్చిన బ్యాంకు యాజమాన్యం... డిమాండ్‌ను బట్టి వాటి సంఖ్యను పెంచాలని యోచిస్తోంది.

తప్పనిసరైతేనే బ్యాంకులకు రండి..

చివరగా డిజిటిల్‌ లావాదేవీలు జరుపుకునే వీలున్న ఖాతాదారులు ఎవరూ బ్యాంకులకు రావొద్దని యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లోనే బ్యాంకులకు రావాలని కోరుతున్నాయి.

ఇదీ చూడండి.. కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details