Bandi Sanjay Reacted on SIT Notices: రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. సిట్ నోటీసులు ఇవ్వాల్సింది తనకు కాదని.. కేసీఆర్, కేటీఆర్కు ఇవ్వాలని అన్నారు. తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు వద్దంటున్నారో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసు, నయీం కేసు విషయంలో సిట్ దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తనకు సిట్ నోటీసులు అందలేదు: ఈ క్రమంలోనే ఆయన తనకు సిట్ నోటీసులు అందలేదని తెలిపారు. ఏ ఇంటికి సిట్ నోటీసులు అంటించారో తెలియదని వివరించారు. తాను ఇంటికెళ్లేసరికి చిరిగిపోయిన కాగితం ఉందని పేర్కొన్నారు. అది ఎవరు అతికించారో తెలియదని వివరించారు. ప్రశ్నాపత్రం లీకేజీ సర్వసాధారణమని ఓ మంత్రి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తీన్మార్ మల్లన్న, విఠల్, సతీశ్ కమల్ను అరెస్టు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఏమీలేని కేసీఆర్కు రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు.
ట్విటర్ నుంచి బయటకు రాకుండా.. ట్వీట్ చేయడమే కేటీఆర్ పని: ట్విటర్ నుంచి బయటకు రాకుండా.. ట్వీట్ చేయడమే కేటీఆర్ పని అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వివరించారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని బండి సంజయ్ వెల్లడించారు.