తెలంగాణ

telangana

ETV Bharat / state

Balanagar Flyover: పనిచేసిన కార్మికురాలితోనే బాలానగర్​ ఫ్లైఓవర్​ ప్రారంభం

హైదరాబాద్​ బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... ఈ వంతెనను ప్రారంభించడమే తరువాయి... కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ మంత్రి కేటీఆర్... వంతెన నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికురాలు శివమ్మతో ఫ్లైఓవర్​ను దగ్గరుండి ప్రారంభింపజేశారు. తనతో ఫ్లైఓవర్​ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని కార్మికురాలు శివమ్మ సంతోషం వ్యక్తం చేశారు.

By

Published : Jul 6, 2021, 4:52 PM IST

Updated : Jul 6, 2021, 8:03 PM IST

balanagar
బాలానగర్​ ఫ్లైఓవర్​ ప్రారంభం

హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ (Balanagar Flyover) ఇవాళ్టి నుంచి నగర ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. మంత్రులు కేటీఆర్ (Minister Ktr), తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేక్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలానగర్ చౌరస్తాలో దుర్భరమైన ట్రాఫిక్‌ కష్టాలు ఉండేవని... అలాంటి ప్రాంతంలో పైవంతెన అందుబాటులోకి రావడం వల్ల ప్రజల చిరకాల కోరిక తీరిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

శివమ్మ చేతుల మీదుగా ఫ్లైఓవర్ ప్రారంభం

మిగతావి కూడా...

జంట నగరాల్లో మొత్తం రూ.30 వేల కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ(SRDP)లో పనులు చేపడుతున్నామని.. ఇందులో మొదటి విడతలో భాగంగా ఇప్పటికే పలు వంతెనలు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు. మిగిలిన ఫ్లైఓవర్లు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే రెండు స్కైవేలు సాధ్యం కావడం లేదని ఆరోపించారు. స్కై వేల కోసం అవసరమైన భూములను కేంద్రం ఇవ్వటం లేదని... దీంతో జూబ్లీ బస్టాండ్ నుంచి తుర్కపల్లి వరకు ప్రతిపాదించిన స్కైవే, ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవేలు పెండింగ్​లో ఉన్నాయన్నారు. ఈ ప్రాంతాల్లో రక్షణ భూములు ఉండడం వల్ల కేంద్రం అనుమతి కోసం నాలుగేళ్ల కింద అడిగినా.. ఇప్పటికీ అనుమతి ఇవ్వలేదన్నారు.

సుచిత్ర వరకు స్కైవే...

కేంద్రం సహకరించకున్నా.... కొంచెం కుదించైనా... ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మిస్తామని కేటీఆర్‌ అన్నారు. ఇవాళ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా బాలానగర్‌ ఫ్లైఓవర్‌కు జగ్జీవన్‌రామ్‌ వంతెనగా పేరు నిర్ణయిస్తున్నామని త్వరలో ఉత్తర్వులు జారీచేస్తామని మంత్రి ప్రకటించారు. బాచుపల్లి రహదారి కూడా త్వరలో విస్తరణ చేపడుతామని మంత్రి హమీ ఇచ్చారు. రూ. 385 కోట్ల వ్యయంతో అనుకున్నా... రూ. 250 కోట్లతో పనులు పూర్తయ్యాయని.. మిగతా నిధులతో ఇదే ప్రాంతంలో రోడ్డు విస్తరణ చేపడతామని చెప్పారు.

హైదరాబాద్ ప్రజలకు మరింత మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను అందించడానికి రవాణా వ్యవస్థను సులభతరం చేయడానికి ఈ ఫ్లైఓవర్లు ఉపయోగపడతాయని నమ్ముతున్నా. నగరంలో జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ మంచి కార్యక్రమాలు చేపడుతున్నాయి. హెచ్​ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ బ్రిడ్జికి డాక్టర్​ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన పేరును నిర్ణయిస్తున్నాం. త్వరలో ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు కూడా ఇస్తాం. మహాకవి ఓకాయన రాసినాడు.. తాజ్​మహల్​కు నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరని. ఎక్కడ పోయినా కూడా రాజకీయ నాయకులకే అగ్రతాంబూళం దక్కుతావుంటది. కానీ ఈ రోజు కార్మికులను గౌరవించుకోవాలనే సీఎం ఆలోచనల మేరకు ఈ ప్రాజెక్టులో రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్న శివమ్మ అనే కార్మికురాలితో ఈ బ్రిడ్జిని ప్రారంభించుకున్నాం.

-- కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంపై కేటీఆర్ స్పీచ్

మూడేళ్లలో పూర్తి...

మూడన్నరేళ్ల వ్యవధిలో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. 2017 ఆగస్టు 21న కేటీఆర్‌... ఫ్లైఓవర్​కు శంకుస్థాపన చేశారు. 1.13 కిలోమీటర్ల పొడవు.. 24 మీటర్ల వెడల్పుతో.. 26 పిల్లర్లతో ఈ వంతెన నిర్మించారు. నగరంలో రోజు రోజుకూ ట్రాఫిక్‌ రద్దీ పెరిగిపోతున్న నేపథ్యంలో 2050 వరకు ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ బ్రిడ్జిని నిర్మించినట్టు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.

గర్వంగా ఉంది...

బాలానగర్‌ డివిజన్‌లోని నర్సాపూర్‌ చౌరస్తాలో ఉన్న నాలుగు రోడ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభంతో ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంత భారీ ఫ్లై ఓవర్​ను తనతో ప్రారంభించడం పట్ల బ్రిడ్జి నిర్మాణ కార్మికురాలు శివమ్మ (Shivamma) ఆనందం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ గత రెండేళ్లుగా ఈ బ్రిడ్జి నిర్మాణంలో పాలుపంచుకుంది. కూలీగా ఇక్కడ విధులు నిర్వహిస్తోంది. శ్రమను గుర్తించి తనతో ప్రారంభించడం గర్వంగా ఉందని ఆమె అన్నారు. తాను మరింత ఉత్సాహంతో పని చేసేందుకు ఇలాంటి ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడుతోందని ఆనందం వ్యక్తం చేశారు.

ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఓపెనింగ్ నేను చేస్తా అనుకోలేదు. పెద్దసారు చేస్తాడనుకున్నా. కానీ సార్ నాతోటి ఓపెనింగ్ చేయించడం చాలా సంతోషంగా ఉంది.

-- శివమ్మ, కార్మికురాలు

పనిచేసిన కార్మికురాలితోనే బాలానగర్​ ఫ్లైఓవర్​ ప్రారంభం

ఇదీ చూడండి: KTR: రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలి

Last Updated : Jul 6, 2021, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details