Babu Jagjivan Ram Birth Anniversary Celebrations: స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తి దాయకమని సీఎం కేసీఆర్ అన్నారు. దళిత సమాజ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఉన్నతమైనదని ముఖ్యమంత్రి తెలిపారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వెల్లడించారు.
అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ కన్న కలను నిజం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని.. మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ అన్నారు. బషీర్బాగ్లోని ఉప ప్రధాని విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బీజేపీ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి మంత్రి సత్యవతి రాఠోడ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ నెల 14న అంబేడ్కర్ సర్క్యూట్ రైలు ప్రారంభం:అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం జగ్జీవన్ రామ్ తన జీవితాన్ని అంకితం చేశారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. బషీర్బాగ్ కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేడ్కర్ స్మారక కేంద్రాలను పర్యటించేలా ఈనెల 14న అంబేడ్కర్ సర్క్యూట్ రైలును ప్రధాని ప్రారంభిస్తారని కిషన్రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు.