తెలంగాణ

telangana

By

Published : Aug 2, 2020, 9:55 AM IST

ETV Bharat / state

సైబర్‌ నేరాలపై అవగాహన అంతంత మాత్రమే!

కరోనా కట్టడి నేపథ్యంలో అందరూ అంతర్జాల వినియోగానికి మొగ్గు చూపుతుండటం సైబర్‌ నేరాల ఉద్ధృతికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మహిళలు, ఆన్‌లైన్‌ చదువుల్లో మునిగితేలుతున్న విద్యార్థులు ఈ నేరాల బారినపడే ప్రమాదం ఉన్నట్లు తెలంగాణ మహిళా భద్రత విభాగం తాజా సర్వేలో తేలింది. ఆన్‌లైన్‌ భద్రతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అవగాహన గురించి తెలుసుకునేందుకు ఈ విభాగం జూన్‌ నెలలో సర్వే చేట్టింది. అందులో సైబర్​ నేరాల పట్ల అవగాహన అంతంత మాత్రమే ఉన్నట్టు తెలింది. అందుకే.. తెలంగాణ మహిళా భద్రతా విభాగం సైబ్‌-హర్ పేరిట ఆన్‌లైన్‌లో నెలపాటు రోజువారీగా అవగాహన సదస్సులు ఆరంభించారు.

Awareness program on cyber crimes
సైబర్‌ నేరాలపై అవగాహన అంతంతమాత్రమే!

సైబర్‌ ఆధారిత లైంగిక వేధింపుల నియంత్రణకు ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరముందని ఐటీ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత చట్టాల గురించే కాక, బాధితులు ఎలాంటి ఆధారాలతో సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న అంశాలపై మహిళలు, యువతకు విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్‌ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెల రోజుల ‘సైబ్‌-హర్‌’ అవగాహన సదస్సుల్లో భాగంగా శనివారం ‘సైబర్‌స్పేస్‌ ద్వారా పిల్లలు, మహిళలపై జరిగే వేధింపుల్ని అరికట్టడం ఎలా’ అనే అంశంపై వెబ్‌ ఆధారిత సదస్సు జరిగింది. సింబయాసిస్‌ లా స్కూల్‌, సైబర్‌పీస్‌, ఐసాక్‌ల సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో మహబూబ్‌నగర్‌ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబర్‌పీస్‌ ఫౌండేషన్‌ సైబర్‌ వ్యవహారాల న్యాయ నిపుణుడు జెనీస్‌ వర్గీస్‌, ఐసాక్‌ సంచాలకుడు రాజశేఖరమూర్తి, సీఐడీ డీఎస్పీ రవికుమార్‌రెడ్డి మాట్లాడారు.

సర్వేలో వెల్లడైన కీలకాంశాలు..
తెలంగాణ మహిళా భద్రతా విభాగం చేసిన సర్వేలో కొన్ని కీలక అంశాలు వెలుగు చూశాయి. కరోనా వల్ల విద్యార్థులంతా ఆన్​లైన్​లోనే తరగతులకు హాజరవుతున్నారు. అయితే.. విద్యార్థుల ఆన్‌లైన్‌ చదువులపై చాలామంది తల్లిదండ్రులు కన్నేసి ఉంచడం లేదు. ఇది అనర్థాలకు కారణమవుతోంది. కొందరు విద్యార్థులు డార్క్‌నెట్‌లోనూ విహరిస్తున్నారు. సరదాగా పంచుకునే వ్యక్తిగత సమాచారం హ్యాకింగ్‌కు గురైతే ఎలాంటి పర్యవసానాలుంటాయో చాలామంది విద్యార్థులకు తెలియడం లేదు. ఆన్‌లైన్‌ నేరాల బాధితుల్లో చాలామంది పరువు పోతుందన్న భయంతోనే పోలీసుల దృష్టికి తేవడం లేదు. కాగా.. ఫిషింగ్‌లాంటి సాధారణ సైబర్‌నేరాల గురించి అవగాహన లేదని, ఈ సర్వేలో 63 శాతం మంది విద్యార్థులు తెలిపారు. 66శాతం మందికి రాన్సమ్‌వేర్‌ గురించి తెలియదు. సామాజిక మాధ్యమాలే హ్యాకర్లు లక్ష్యంగా చేసుకొని సమాచారం సేకరిస్తారని తెలిసిన వారు 75శాతం. అయితే.. ఆన్‌లైన్‌ ఖాతా, బ్యాంకు ఖాతాలు హ్యాకింగ్​కు గురయితే.. పోలీసులకు చెప్తాం అన్నవారు.. కేవలం 40శాతం మాత్రమే.

ఇదీ చదవండి:దేశంలో ఏ పార్టీకి లేని పటిష్ఠమైన యంత్రాంగం తెరాసకు ఉంది: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details