భాగ్యనగరంలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన జియాగూడ, కుల్సుంపురా, కార్వాన్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ప్రతి అనుమానితుడి స్వాబ్ శాంపిళ్లను పరీక్షలకు పంపుతున్నారు. ఆసుపత్రులకు, హోల్సేల్ మార్కెట్లకు వెళ్లి వచ్చినవారిలో తొలుత లక్షణాలు బయట పడుతున్నాయి. మలక్పేట్ గంజ్తో సంబంధం ఉన్న పలువురిలో కరోనా వైరస్ వెలుగుచూసింది.
కంటెయిన్మెంట్ జోన్గా ప్రకటించి జాగ్రత్తలు తీసుకొని కేసులు తగ్గాక జోన్లు ఎత్తేశారు. ఆ తర్వాతా అక్కడ కొత్త కేసులు బయట పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎల్బీనగర్, కార్వాన్ తదితర ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వెలుగు చూశాయి. దీంతో చర్యలు మరింత తీవ్రం చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఆ రెండు ప్రాంతాల్లో దడ...
వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతోందని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో పశ్చిమ మండలంలో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. మొత్తం 285 కేసులు నమోదయ్యాయి. కుల్సుంపురా పోలీస్ ఠాణా పరిధిలోని జియాగూడ, మంగళ్హాట్లోని గోడేకీ కబర్ ప్రాంతాలు హాట్స్పాట్లుగా మారాయి. జియాగూడ ప్రాంతంలో 4 రోజుల వ్యవధిలో 42 కేసులు నమోదయ్యాయి.
ఒక్క స్నానపు గది.. 15 కేసులు...
మంగళ్హాట్లోని కామాటిపుర బస్తీలో ఈనెల 11న ఓ వ్యక్తికి(45) కరోనా పాజిటివ్ వచ్చింది. అతను నివసిస్తున్న ఇంట్లో మరో నాలుగు కుటుంబాలు అద్దెకుంటున్నాయి. వీరందరికీ ఒకటే స్నానపుగది(బాత్రూమ్) ఉంది. ఆయా కుటుంబాల్లోని 15 మందికి కరోనా వ్యాపించడానికి ఈ స్నానపు గదే కారణమని అధికారులు భావిస్తున్నారు.
ఇంట్లో వృద్ధులుంటే జాగ్రత్త...
ముఖ్యంగా వృద్ధులపై కరోనా పడగ విప్పుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 34 మంది కరోనాతో మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించగా.. అందులో 40 నుంచి 89 మధ్య వయస్కులవారే 32 మంది ఉన్నారు. వీరిలో నగరానికి చెందిన వారే 90 శాతం వరకు ఉండడం గమనార్హం. ఇప్పటికే అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, కిడ్నీ, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా కరోనా సోకినా చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వీరు ఇటు అటు తిరుగుతూ వాహకాలుగా మారుతుంటారు. వీరి ద్వారానే ఇంట్లో పెద్దలకు సోకే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తత, జాగ్రత్తలతోనే మనల్ని మనం కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
గుర్తించకనే గుప్పుమంటోందా..?
కరోనా వైరస్ సోకిన వారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తించడంలోనే సమస్య వస్తున్నట్లు క్షేత్రస్థాయి అధికారులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖ బృందాలు ప్రైమరీ కాంటాక్టుల ఇళ్లకు వెళ్లినప్పుడు, కొందరు తమకు కరోనా లక్షణాలు లేవని వాదిస్తున్నారు. మరికొందరు తమవారు బయటకెళ్లారని చెబుతున్నారు. వారు స్వీయ నిర్బంధంలో ఉన్నారా? లేదా? అన్నది తెలియడంలేదు. కొవిడ్-19 లక్షణాలు ఉంటేనే పరీక్షలు నిర్వహించాలన్న నిబంధన ఉండడమూ సమస్యగా మారింది.