తెలంగాణ

telangana

By

Published : Feb 12, 2023, 10:21 AM IST

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా లోక్అదాలత్... లక్షల్లో పరిష్కారమైన కేసులు

National Lok Adalats in Telangana: జాతీయ లోక్‌అదాలత్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లోక్అదాలత్​లను శనివారం ఏర్పాటు చేశారు. వివిధ కోర్టులో లోక్‌ అదాలత్‌ ద్వారా 3,30,866 కేసులు పరిష్కారం చేసినట్లు న్యాయవాదులు వెల్లడించారు. కక్షిదారులు ఏకాభిప్రాయంతో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారం విషయంలో రాజీకి వచ్చారు.

Lok Adalats started across the state
రాష్ట్రవ్యాప్తంగా లోక్అదాలత్​లు ప్రారంభం

National Lok Adalats in Telangana: జాతీయ లోక్‌అదాలత్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా శనివారం వివిధ కోర్టుల్లో మూడు లక్షల 30,866 కేసులు పరిష్కారమయ్యాయి. అందులో 8,292 ప్రీలిటిగేషన్‌ కేసులు ఉండగా మిగిలిన 3 లక్షల 21 వేల 604 పెండింగ్‌లో ఉన్నవి పరిష్కరించారు. కక్షిదారులు ఏకాభిప్రాయంతో భారీ సంఖ్యలో కేసుల పరిష్కార ద్వారా రూ.225.48 కోట్ల పరిహారం చెల్లింపునకు ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కమిటి ఛైర్మన్‌ జస్టిస్‌ వినోద్‌కుమార్‌ పర్యవేక్షణలో లోక్‌ అదాలత్‌ విజయవంతమైనట్లు రాష్ట్ర సభ్య కార్యదర్శి గోవర్ధన్‌ రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్​లో 78,975 కేసులకు పరిష్కారం: నాంపల్లిలోని మనోరంజన్‌ కోర్టు కాంప్లెక్స్‌లో జాతీయ లోక్‌ అదాలత్‌ను శనివారం మెట్రోపాలిటన్‌ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, సెషన్స్‌ జడ్జి పాపిరెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 31 లోక్‌అదాలత్‌ బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 15 నాంపల్లిలో, 9 మనోరంజన్‌ కోర్టు కాంప్లెక్స్‌లో, 7 సికింద్రాబాద్‌ కోర్టు కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఈ సందర్భంగా రాజీ చేసుకోదగిన క్రిమినల్‌ కేసులు, మోటార్‌ ప్రమాద కేసులు, గృహ హింస కేసులు, చెక్‌ బౌన్స్‌ కేసులు, ప్రి లిటిగేషన్‌ కేసులు మొత్తం 78,975 పరిష్కరించినట్లు తెలిపారు. మెట్రోపాలిటన్‌ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్‌, 1వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కుష, డిప్యూటీ కమిషనరు ఆఫ్‌ పోలీసు డా.పి.శబరీష్‌, సీనియర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీవాణి, మనోరంజన్‌ కోర్టు కాంప్లెక్స్‌ జుడిషియల్‌ ఆఫీసర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.

రాచకొండలో 3,335: రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో శనివారం ఒక్కరోజే 3335 కేసులు పరిష్కారమయ్యాయి. రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా న్యాయస్థానాల్లో నిర్వహించినట్లు సీపీ డీఎస్‌ చౌహాన్‌, అదనపు కమిషనర్‌ సత్యనారాయణ వెల్లడించారు.

రంగారెడ్డి కోర్టులో 82,283:రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌కే భూపతి శనివారం న్యాయసేవాసదన్‌లో ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 82,283 కేసులు పరిష్కరించినట్లు సంస్థ జిల్లా కార్యదర్శి శ్రీదేవి ప్రకటించారు. ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి(ఎంఎస్‌జే) రేండ్ల తిరుపతి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, స్థానిక డీసీపీ సాయిశ్రీ, ప్రాసిక్యూషన్‌ విభాగం డిప్యూటి సంచాలకులు కస్తూరి పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో:యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్​ను జిల్లా జడ్జి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కోర్టులోని ఇతర న్యాయమూర్తులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్ రావు మాట్లాడుతూ రాజీ మార్గమే రాజ మార్గమని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ కోసం 5 బెంచ్​లను ఏర్పాటు చేశామని అన్నారు.

జాతీయ లోక్ అదాలత్​లో సివిల్, కొన్ని లిమిటేషన్స్​తో క్రిమినల్ కేసులు పరిష్కరించవచ్చు అని అన్నారు. ముఖ్యంగా సివిల్ కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ కేసులు ఉంటున్నయని లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చు అని , అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీస్, లీగల్ ఎయిడ్ లాయర్ల సహకారంతో కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details