తెలంగాణ

telangana

ETV Bharat / state

'హైదరాబాద్​ను తలదన్నేలా విశాఖను అభివృద్ధి చేస్తాం'

విఖలో 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే హైదరాబాద్​ను తలదన్నే రాజధాని నిర్మించవచ్చని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. విశాఖనే రాజధానిగా ప్రభుత్వం ప్రకటిస్తోందని వస్తున్న ఊహాగానాలపై మంత్రి స్పందించారు. విశాఖనే పాలనా కేంద్రమని పరోక్షంగా స్పష్టం చేశారు. చంద్రబాబులా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవటం తమకు చేతకావటంలేదని విమర్శించారు. నిపుణులతో ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను బొత్స సమర్థించారు.

By

Published : Jan 5, 2020, 7:45 AM IST

AP minister botsa Fires on babu
'హైదరాబాద్​ను తలదన్నేలా విశాఖను అభివృద్ధి చేస్తాం'

'హైదరాబాద్​ను తలదన్నేలా విశాఖను అభివృద్ధి చేస్తాం'

ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయటమే ధ్యేయంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం తిరుపతిలో పర్యటించిన బొత్స.. ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి నగరంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రాజధాని నిర్మాణమంటే కేవలం ఓ టౌన్ షిప్ అభివృద్ధి మాత్రమే కాదని బోత్స సత్యనారాయణ అన్నారు.

రూ.3వేల కోట్లతో ఎలా అవుతుంది

మూడు వేల కోట్లు ఖర్చు పెడితే అమరావతి పూర్తవుతుందని చంద్రబాబు చెప్పటం హాస్యాస్పదమన్నారు. రహదారుల నిర్మాణం, లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం వేల కోట్ల రూపాయలకు టెండర్లను పిలిచిన చంద్రబాబు... మూడువేల కోట్ల రూపాయలతో అమరావతిని ఏవిధంగా పూర్తి చేయాలని ప్రశ్నించారు. పంటలున్న ప్రాంతంలో భవనాల నిర్మాణం వద్దని శివరామకృష్ణ చెప్పిన విషయాన్ని చంద్రబాబు విస్మరించారని ఆరోపించారు. రాజధాని కమిటీ నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు.

హైదబారాబాద్​ను తలదన్నే రాజధానిగా విశాఖ

బీసీజీని ఓ పనికిమాలిన నివేదికగా చంద్రబాబు అభివర్ణించటాన్ని బొత్స తప్పుబట్టారు. కేవలం సచివాలయం అమరావతి నుంచి తరలిస్తుంటే ఉద్యోగులు, రైతులను రెచ్చగొట్టటం సబబు కాదన్నారు. మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా... అమరావతి టౌన్ షిప్ నిర్మాణం పూర్తికాదన్నారు. నిధులన్నీ అమరావతికే ఖర్చు పెడితే ఇతర అభివృద్ధి పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. కేవలం 10 వేల కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్​ను తలదన్నే రాజధానిగా విశాఖ మారుతుందని అన్నారు.

ఆయన్ను నమ్మితే నట్టేట మునుగుతారు

చంద్రబాబును నమ్మితే నట్టేట మునిగిపోతారనే నానుడికి తానే ప్రత్యక్ష ఉదాహరణ అన్న బొత్స.. వోక్స్ వ్యాగన్ వివాదాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుకు సన్నిహితుడనే చోస్టన్ అనే వ్యక్తిని నమ్మి గతంలో వోక్స్ వ్యాగన్ కోసం ఎంవోయూ కుదుర్చుకున్నామన్న ఆయన.. చివరికి అతను మోసం చేయటం వలన నాలుగేళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్నానన్నారు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం నష్టపోతుందనే ఆందోళనతో చంద్రబాబు భాష రోజురోజుకూ దిగజారుతోందని బొత్స విమర్శించారు. చంద్రబాబు బీపీ పెరిగిపోతుంటే టాబ్లెట్ వేసుకుని ఇంట్లో కూర్చోవాలంటూ మండిపడ్డారు.

ఎక్కడా 130 అడుగులు తవ్వకాలు అనవసరం

దేశంలో... సొంత రాష్ట్రంలో ఇల్లులేని నాయకుడు చంద్రబాబు ఒక్కరేనని మంత్రి బొత్స ఆరోపించారు. చంద్రబాబుకు నగరాల జనాభా పైనా అవగాహన లేదన్నారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు రాకూడదనే నాడు జగన్ మౌనం వహించారన్న మంత్రి... అమరావతిలా ఎక్కడా భవన నిర్మాణ పునాదుల కోసం 130 అడుగులు తవ్వాల్సిన అవసరం లేదన్నారు. సచివాలయం మార్పు మినహా... రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందనే అవాస్తవాలను రైతులు నమ్మొద్దన్నారు. చంద్రబాబు ఉచ్చులో పడకుండా ఉండాలని రైతులకు హితవుపలికారు.

ఇదీ చదవండి :కారు ఫుల్ అయింది .. లొల్లి మొదలైంది!

ABOUT THE AUTHOR

...view details