తెలంగాణ

telangana

By

Published : Jul 7, 2021, 10:00 AM IST

ETV Bharat / state

AP High Court: ప్రభుత్వ విధానాలపై భిన్నాభిప్రాయం చెబితే గొంతు నొక్కేస్తారా?

ప్రభుత్వ విధానాల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారి గొంతు నొక్కితే సహించబోమని ఏపీ హైకోర్టు స్పష్టంచేసింది. నిజాయితీగా అభిప్రాయాలు చెప్పేవారి పక్షాన నిలవాల్సిందేనని తేల్చిచెప్పింది. మీడియా ప్రతినిధులతో పాటు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ కేసులు నమోదు చేస్తోందని, ఎఫ్​ఐఆర్​ ప్రతులను 24 గంటల్లోపు వెబ్‌సైట్లో పొందుపరచడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

AP High Court
ఏపీ హైకోర్టు

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన మీడియా వారితోపాటు ఇతరులపై నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారంటూ... టీవీ-5 న్యూస్ ఛానల్‌కు చెందిన బి.రాజగోపాల్ నాయుడు దాఖలు చేసిన పిల్‌పై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.కే.గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్య ధర్మాసనం విచారణ జరిపింది. ఎఫ్​ఐఆర్​ నమోదైన 24 గంటల్లో అధికారిక వెబ్‌సైట్లో అప్లోడ్ చేస్తున్నారా, లేదా అన్నది చెప్పాలని.. అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్‌ను ఆదేశించింది. ప్రాథమిక విచారణ చేయకుండానే కేసులు నమోదు చేస్తున్నారని.. వ్యక్తులు ఎవరైనా రెండు, మూడు రోజులు కనిపించకపోతే ఆందోళనతో కుటుంబసభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తున్న సందర్భాలు చూస్తున్నామని తెలిపింది. ఆ తర్వాతే నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్న విషయం తమ దృష్టిలో ఉందని వ్యాఖ్యానించింది. ఒకవేళ కేసు నమోదైన 24 గంటల్లో వెబ్‌సైట్లో ఎఫ్​ఐఆర్​ అప్‌లోడ్ అయితే.. దాని ఆధారంగా కుటుంబ సభ్యులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని పేర్కొంది.

కొన్ని పోస్టులు వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి..

భావప్రకటన స్వేచ్ఛ ఉందనడంలో సందేహం లేదన్న ధర్మాసనం.. సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని అభిప్రాయపడింది. కొన్ని పోస్టులు దారుణంగా ఉంటున్నాయని.. సామాజిక మాధ్యమాల ద్వారా హైకోర్టు న్యాయమూర్తులపైనా దుష్పచారం చేసిన ఘటనపై కేసులు నమోదైన విషయాన్ని ప్రస్తావించింది.

ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరుగుతోంది..

ప్రాథమిక విచారణ చేయకుండానే సీఐడీ నేరుగా కొన్ని తప్పుడు కేసులు నమోదు చేస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది ఉమేశ్‌చంద్ర హైకోర్టుకు నివేదించారు. అగ్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా.. ఏడేళ్లలోపు జైలు శిక్ష విధించేందుకు వీలున్న కేసుల్లో కూడా వ్యక్తుల్ని అరెస్ట్ చేసి, రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఎన్ని ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారు, ఎన్నింటిలో నిందితుల్ని రిమాండుకు పంపారు, కేసుల స్థితి ఏంటనే వివరాల్ని కోర్టు ముందు ఉంచేలా ఆదేశించాలని కోరారు. ఎఫ్​ఐఆర్​ దస్త్రాలను 24 గంటల్ వెబ్‌సైట్లో ఉంచడం లేదని.. దీనివల్ల ముందస్తు బెయిలు పొందే అవకాశం లేకుండా పోతోందన్నారు. ఈ చర్యతో నిందితుల ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయన్నారు.

వ్యక్తుల గొంతు నొక్కేందుకు తప్పుడు కేసులు..

ప్రభుత్వ విధానాలపై భిన్నాభిప్రాయాల్ని వ్యక్తపరిచే వ్యక్తుల గొంతు నొక్కేందుకు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని.. అతి పవిత్రమైన భావప్రకటన, వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని వాదించారు. ఎఫ్​ఐఆర్​ వివరాలు వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అప్పుడు చట్టబద్ధ హక్కులను ప్రజలు వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. పిటిషనర్ ఎవరని అడిగింది. ఆయన వ్యాపారవేత్త అని, టీవీకి సంబంధించిన వారని న్యాయవాది బదులిచ్చారు. సాధారణ ఆరోపణలతో పిల్ దాఖలు చేయడం విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని.. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదించారు.

సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టింగ్‌ల వ్యవహారం న్యాయస్థానాల విచారణ పరిధిలో ఉందన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌కు ప్రభుత్వం, అధికారులు బాధితులుగా మారుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రిపై కట్టుకథలల్లి కొంతమంది మీడియాలో ప్రసారం చేస్తున్నట్లు చెప్పారు. ఎఫ్​ఐఆర్​ అప్‌లోడ్‌పై పూర్తి వివరాలు సమర్పించేందుకు 10 రోజులు సమయం కావాలని AG కోరడంతో.. విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:భావప్రకటనకు ప్రతిబంధకంగా ఐటీ చట్టంలో ఆ సెక్షన్​!

ABOUT THE AUTHOR

...view details