తెలంగాణ

telangana

ETV Bharat / state

బడ్జెట్​లో సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం ఇవ్వనున్న ఏపీ సర్కార్​

ఏపీప్రభుత్వం బడ్జెట్​లో సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. మొత్తం రూ. 2.30 లక్షల కోట్ల అంచనాతో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి బడ్జెట్​ను శాసనసభకు సమర్పించనున్నారు. కరోనా కారణంగా తొలి 3 నెలలకు రూ.70,994.98 కోట్ల ఓట్​ ఆన్​ అకౌంట్​ బడ్జెట్​ను ఆర్డినెన్స్​ రూపంలో తీసుకొచ్చారు. ప్రస్తుత సమావేశాల్లోనే ఓట్​ ఆన్​ అకౌంట్​తో పాటు మిగిలిన 9 నెలల పద్దుకూ సభ ఆమోదం తీసుకుంటారు.

By

Published : Jun 16, 2020, 8:00 AM IST

ap-government-allocated-more-funds-to-nava-ratnalu
బడ్జెట్​లో సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం ఇవ్వనున్న ఏపీ సర్కార్​

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మంగళవారం శాసనసభకు సమర్పించనున్నారు. మొత్తం రూ.2.30 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. కరోనా కారణంగా తొలి 3 నెలలకు రూ. 70,994.98 కోట్ల ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌’ను ఆర్డినెన్స్​ రూపంలో తీసుకొచ్చారు. ప్రస్తుత సమావేశాల్లోనే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌తో పాటు మిగిలిన 9 నెలల పద్దుకూ... సభ ఆమోదం తీసుకుంటారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు విడిగా సభ ముందుంచనున్నారు.

నవరత్నాలకు ప్రాధాన్యం

నవరత్నాలే ప్రాధాన్యాంశాలుగా బడ్జెట్‌ ఉండబోతోంది. ప్రతిపాదనలు స్వీకరించేటప్పుడే ఆయా ప్రభుత్వశాఖలకు ఈ మేరకు ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పడ్డాక మిగిలిన కాలానికే సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి కాలానికి కేటాయింపులు చూపడం వల్ల గత బడ్జెట్‌లో కన్నా నవరత్నాల లెక్కలు పెరగబోతున్నాయి. విద్య, వైద్య రంగాల సంక్షేమ పథకాలపై చేసే ఖర్చునూ.. మానవ వనరులకు సంబంధించిన పెట్టుబడి వ్యయంగానే భావిస్తున్నట్లు ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే కోణంలో సంక్షేమ వ్యయం ఎక్కువగాను, పెట్టుబడి వ్యయం కాస్త తక్కువగాను, నిర్వహణ, జీతాలు, పింఛన్లు, వడ్డీల చెల్లింపుల వంటి ఖర్చులతో బడ్జెట్‌ రూపుదిద్దుకున్నట్లు సమాచారం.

ఆశించిన మేర ఆదాయమేదీ...

కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.2,27,975 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ సమర్పించగా అన్ని రకాల ఆదాయాలు కలిపి రూ.1.87 లక్షల కోట్లకే పరిమితమైనట్లు ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి. గత ఏడాది ఆశించిన ఆదాయాలు రాలేదని, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో పరిస్థితుల్ని అంచనా వేయడం కష్టమేనని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వీలైనంత వరకు పరిస్థితుల్ని అనువుగా మలచుకుని ఎక్కువ ఆదాయం సాధించే మార్గాల్ని అన్వేషిస్తామని, తదనుగుణంగానే బడ్జెట్‌ అంచనాల రూపకల్పన ఉంటుందని అధికారుల విశ్లేషణ. ప్రతి ఏడాదీ కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో పెద్దమొత్తం ఆశిస్తూ ఆ మేరకు అంచనాలు చూపుతున్నా.. సాధిస్తున్నది తక్కువే. మరోవైపు కరోనా సంక్షోభ సమయంలో కొత్త పథకాలకు కేంద్రం ఎంతవరకు నిధులు సర్దుబాటు చేయగలుగుతుందనేదీ చర్చనీయాంశం. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్ర సొంత ఆదాయాలు... ఉద్యోగుల జీతాలు, పింఛన్లకే సరిపోతాయని ఆర్థికశాఖ లెక్క కట్టింది.

కరోనా వల్ల అంచనాలు తలకిందులు

కరోనా వల్ల తొలి 3 నెలలూ రాష్ట్ర సొంత ఆదాయాల అంచనాలు దారుణంగా తలకిందులయ్యాయి. ఆర్థిక కార్యకలాపాలు ఎప్పటికి గాడిన పడతాయో తెలియడం లేదు. జీతాలు, పింఛన్లకూ ఇతర మార్గాల్ని ఆశ్రయించక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవరత్నాలకు దాదాపు రూ.60 వేల కోట్లకు పైగా ఖర్చు కానుందని అంచనా. వైఎస్సార్‌ చేయూత కింద ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.18,500 సాయం చేయనున్నారు. ఆ మేరకు కేటాయింపులు జరపనున్నారు. ఏడాదికి లబ్ధిదారుల సంఖ్యను బట్టి దాదాపు రూ.5,000 కోట్ల దాకా ఖర్చయ్యే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్​ కీలక సమావేశం

ABOUT THE AUTHOR

...view details