తెలంగాణ

telangana

Joint Staff Council: సీపీఎస్ రద్దు అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం: ఏపీ సీఎస్‌

By

Published : Oct 29, 2021, 11:25 PM IST

సీపీఎస్ రద్దు అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నామని ఏపీ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన సీఎస్.. సీపీఎస్ రద్దు అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన వైఖరితో ఉన్నారన్నారు. కాగా..కంటితుడుపు చర్యగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారని.. పీఆర్సీపీపై స్పష్టత లేదని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు.

Joint Staff Council
Joint Staff Council

సీపీఎస్ రద్దు అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నామని, ఈ అంశంపై ఏపీ సీఎం జగన్ స్పష్టమైన వైఖరితో ఉన్నారని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టం చేశారు. సీఎస్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, ఉద్యోగుల డిమాండ్లపై చర్చించారు. మొత్తం 13 గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఈ సమావేశానికి ఆహ్వానించింది. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వేతనాల పెంపుపైనా సమావేశంలో చర్చించారు.

Joint Staff Council: సీపీఎస్ రద్దు అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం: ఏపీ సీఎస్‌

ఉద్యోగులంతా ప్రభుత్వానికి సహకరించాలని.. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయని సీఎస్ ఉద్యోగ సంఘాలను కోరారు. సరైన వేళకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఉద్యోగ సమస్యలపై సీఎస్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఉద్యోగ సంఘాలతో ఇది ప్రాథమిక సమావేశం మాత్రమేనని... మరోసారి భేటీ అవుదామని సీఎస్‌ సూచించారు. ఉద్యోగ సంఘాల న్యాయమైన డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ హామీ ఇచ్చారు.

ఉద్యోగులంతా ప్రభుత్వానికి సహకరించాలి. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. సరైన వేళకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సీపీఎస్ రద్దు అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం. సీపీఎస్‌ రద్దుపై సీఎం స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఉద్యోగ సమస్యలపై సీఎస్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి. ఉద్యోగ సంఘాలతో ఇది ప్రాథమిక సమావేశం మాత్రమే. ఉద్యోగ సంఘాల డిమాండ్లు సీఎం దృష్టికి తీసుకెళ్తా.-సమీర్ శర్మ, సీఎస్‌

పీఆర్సీపై స్పష్టత లేదు: బొప్పరాజు

ఉద్యోగుల ఆరోగ్య కార్డుల సమస్య గురించి సమావేశంలో వివరించామని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. మెడికల్‌ రీ ఎంబర్స్‌మెంట్‌ పొడిగించాలని చెప్పామన్నారు. త్వరలో సంబంధిత ఉన్నతాధికారులతో చర్చ ఏర్పాటు చేస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. పీఆర్సీపై స్పష్టత లేదని.. వారం రోజుల్లో కమిటీ వేస్తామని సీఎస్ వెల్లడించినట్లు చెప్పారు.

కారుణ్య నియామకాల గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. కారుణ్య నియామకాలపై సీఎం చెప్పినా అమలు కాలేదు. మరోసారి జాయింట్‌ కౌన్సిల్‌ భేటీ ఏర్పాటు చేస్తామన్నారు. తదుపరి భేటీలోగా సమస్యలకు పరిష్కారం వస్తుందని చెప్పారు. పీఆర్సీపై స్పష్టత లేదు. 27 శాతం ఫిట్‌మెంట్‌తో నోట్ మాత్రమే ఇచ్చారు. పీఆర్సీపై వారం రోజుల్లో కమిటీ వేస్తామన్నారు. పింఛన్లు, జీతాలపై స్పష్టత లేదు. మాకు రావాల్సిన బకాయిలపై స్పష్టత లేదు. బకాయిలపై వారంలో భేటీ అవుతామని చెప్పారు. వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై తెలిపాం. వచ్చేనెల 30లోపు ఆయా కార్యదర్శులతో భేటీకి హామీ ఇచ్చారు. 4 నెలల తర్వాత కౌన్సిల్ భేటీ పెట్టాలని సీఎస్ చెప్పారు. పీఆర్సీపై వారంలో స్పష్టత రాకపోతే కార్యాచరణ ప్రకటిస్తాం.-బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

వారంలోగా పీఆర్సీ నివేదిక ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు సచివాలయ ఉద్యోగ సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. సీపీఎస్‌పై పది రోజుల్లో భేటీ పెడతామని సీఎస్ వెల్లడించినట్లు తెలిపారు. సమస్యలపై సీఎస్‌ సానుకూలంగా స్పందించారన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ కంటి తుడుపు చర్య అని ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు అన్నారు. పీఆర్‌సీ నివేదికపై 4 రోజుల్లో చెబుతామనడం సంతోషకరమన్నారు. ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించారు.


ఇదీ చూడండి:Revanth reddy: కేటీఆర్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. భీమవరం నుంచా లేక బొబ్బిలి నుంచా..?

ABOUT THE AUTHOR

...view details