తెలంగాణ

telangana

CM Jagan: గతంలో ఉన్న కరోనా నిబంధనలు అమలు చేయండి : సీఎం జగన్

By

Published : Nov 29, 2021, 10:58 PM IST

కొవిడ్ కొత్త వేరియంట్ హెచ్చరికల దృష్ట్యా ఎలాంటి పరిస్ధితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఏపీ సీఎం జగన్ (AP CM Jagan ) ఆదేశించారు. గతంలో చేసిన విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్​ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికీ ఆర్టీపీసీఆర్ పరీక్ష మాత్రమే చేయాలని.. ర్యాపిడ్ టెస్టులు చేయవద్దన్నారు.

ap cm jagan
ap cm jagan

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విస్తరిస్తున్న దృష్ట్యా ఆరోగ్యశాఖ అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం (ap CM Jagan) నిర్వహించారు. క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన సమీక్షకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొత్త వేరియంట్ హెచ్చరికల దృష్ట్యా అందరూ మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జనాలు గుమిగూడకుండా చూడాలన్నారు. మాస్క్‌ విషయంలో ప్రత్యేక డ్రైవ్‌ చేయాలని, గతంలో ఉన్న నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా డోర్‌ టూ డోర్‌ వ్యాక్సినేషన్, ఫీవర్‌ సర్వే రెండూ చేయాలని నిర్దేశించారు. అవగాహన, అప్రమత్తత రెండూ ముఖ్యమన్న సీఎం.. మాస్క్‌కు సంబంధించిన గైడ్‌ లైన్స్‌ వెంటనే అమల్లోకి తేవాలని ఆదేశించారు.

వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగవంతం చేయండి..

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత ఉద్ధృతంగా చేయాలని ముఖ్యమంత్రి జగన్(cm jagan) అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్లను వీలైనంత త్వరగా వినియోగించాలన్నారు. వ్యాక్సినేషన్‌ విషయంలో దూకుడుగా ఉండడం చాలా ముఖ్యమని, డిసెంబర్‌ నెలాఖరికల్లా రెండు కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలన్న లక్ష్యం పెట్టుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో వెనకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డిసెంబర్, జనవరి కల్లా అందరికీ రెండు డోస్‌ల వ్యాక్సినేషన్‌ పూర్తిచేస్తామన్న అధికారులు తెలిపారు. కేంద్రం చెబుతున్నట్లుగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్ నుంచి వస్తున్న వారిపై కేంద్రం ప్రత్యేక దృష్టిపెడుతున్నట్లు వెల్లడించారు.

ర్యాపిడ్ టెస్టులు వద్దు..

త్వరలోనే విజయవాడలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ అందుబాటులోకి వస్తుందని సీఎంకు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వస్తున్న వారిలో పాస్‌పోర్ట్‌లో ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌ ఉన్న వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు వివరించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో స్పెషల్‌ మెడికల్‌ టీమ్స్‌ను ఏర్పాటుచేసి ఏపీకి వచ్చే వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ చేయాలని సీఎం సూచించారు. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు మాత్రమే చేయాలని, ర్యాపిడ్‌ టెస్ట్‌లు వద్దని స్పష్టం చేశారు.

ఎలాంటి పరిస్థితులు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కొవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సీజన్‌ పైప్‌లైన్లు సరిగ్గా ఉన్నాయా..? లేవా..? వైద్యులు అందుబాటులో ఉన్నారా లేదా అనే అంశంపై తనిఖీ చేయాలన్నారు. ఎంప్యానల్‌ ఆసుపత్రుల్లో వసతులను తనిఖీ చేయాలన్నారు. క్వారంటైన్‌ కేంద్రాలు , కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు, కొవిడ్‌ కాల్‌ సెంటర్‌లను తిరిగి పరిశీలించాలని సూచించారు. ఏ అనారోగ్య సమస్య ఉన్నా 104 కు కాల్‌ చేస్తే వైద్యం అందుబాటులో ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌లను, లైన్‌ డిపార్ట్‌మెంట్‌లను సిద్ధం చేయాలన్నారు. టెండర్లు పూర్తయిన మెడికల్‌ కాలేజీలకు వెంటనే అగ్రిమెంట్‌లు పూర్తిచేయాలని నిర్దేశించారు.

ఇదీ చూడండి:KCR On Yasangi: 'యాసంగి పంటకు కొనుగోలు కేంద్రాలు ఉండవు'

ABOUT THE AUTHOR

...view details