CID Filed Case On Siemens: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ అప్పటి ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట ప్రసాద్తో పాటు పుణెకు చెందిన డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబయికి చెందిన స్కిలర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ తదితర 26 మందిని నిందితులుగా పేర్కొంది. ఐపీసీలోని సెక్షన్ 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 రెడ్విత్ 120బీ సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్విత్ 13(1)(సీ) (డీ) సెక్షన్ల ప్రకారం ఈ కేసు పెట్టింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కె.అజయ్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు.
ఈ ప్రాజెక్టులో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైనందున సమగ్ర దర్యాప్తు జరపాలని సీఐడీని కోరుతూ ఈ ఏడాది జులై 11న నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మెమో జారీచేశారు. వాటి ఆధారంగా ఈ నెల 9న కేసు నమోదు చేసినట్లు సీఐడీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఆర్థిక నేరాల విభాగం-2 డీఎస్పీ ఎం.ధనుంజయుడిని దర్యాప్తు అధికారిగా నియమించింది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ నుంచి జులై 7న అందిన నివేదిక, ఈ నెల 9న అందిన సీఐడీ ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్లో వివరించింది.
ఎఫ్ఐఆర్లో ఏం ఉందంటే?
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులు, యువతకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా మొత్తం ఆరు నైపుణ్య క్లస్టర్ల ఏర్పాటు కోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం ఒక్కో నైపుణ్య క్లస్టర్ ఏర్పాటుకు రూ.546.84 కోట్ల వ్యయమవుతుంది. అందులో రూ.491.84 కోట్లు (90%) గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్లు సమకూరుస్తాయి. రాష్ట్ర వాటా కింద రూ.55 కోట్లు (10%) భరించాలి.