శాసనసభకు సలహాలు ఇవ్వాల్సిన శాసనమండలి రాజకీయ అజెండాతో పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇలాంటి మండలి మనకు అవసరమా అని ప్రశ్నించారు. శాసనసభలో ఆమోదం పొందిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనసమండలి ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపించిన తరుణంలో మండలి వ్యవహారాలపై ఇవాళ శాసనసభలో చర్చ జరిగింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇవాళ శాసనసభ కార్యక్రమాలకు దూరంగా ఉంది. ఉదయం నుంచి మండలి వ్యవహారంపై సుదీర్ఘమైన చర్చ జరిగింది.
మండలి పరిణామాలతో ..
ప్రణాళిక వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనసభ సోమవారం ఆమోదించింది. ఆ తర్వాత ఈ బిల్లులను మంగళవారం శాసనమండలిలో ప్రవేశపెట్టారు. తమకు మెజార్టీ ఉన్న శాసనమండలిలో ఈ బిల్లులను అడ్డుకునేందుకు.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది. ఆర్టికల్ 71 కింద ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నామని.. దానిపై చర్చ చేపట్టాలని కోరింది. బిల్లులపై చర్చించాలని మంత్రులు పట్టుబట్టారు. మంగళ, బుధవారాల్లో మండలిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల మధ్యలోనే బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి ఛైర్మన్ నిర్ణయం వెలువరించారు.
ఈ పరిణామంతో కంగుతిన్న అధికారపక్షం ఇవాళ శాసనసభలో దీనిపై చర్చ చేపట్టింది. చర్చలో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి .. ప్రజల చేత ఎన్నుకున్న శాసనసభ నిర్ణాయాలను మండలి అడ్డుకుంటోందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా..? అని ప్రశ్నించారు. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మండళ్లు ఉన్నాయని.. చెప్పారు. ప్రతి ఏటా 60కోట్లు మండలి కోసం ఖర్చు చేస్తున్నామని... అయినప్పటికీ శాసనమండలి తన పాత్రను సరిగ్గా నిర్వర్తించడం లేదన్నారు. పెద్దల సభగా తమకు సలహాలు ఇవ్వాల్సిన మండలి.. రాజకీయ దురుద్దేశంతో బిల్ల్లులను అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు.