Teacher Locked a student in sangareddy Anganwadi Center: చిన్నారి గదిలో ఉండగానే అంగన్వాడీ టీచర్లు తాళం వేసి వెళ్లిపోయిన సంఘటన సంగారెడ్డి జిల్లా కాజీపల్లిలో జరిగింది. బాలిక కనిపించకపోవడంతో బొల్లారం పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలిక ఆచూకీ గురించి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్ల చిన్నారి అవంతిక కాజీపల్లి అంగన్వాడీ కేంద్రంలో చదువుతోంది. రోజులాగే అంగన్వాడీకి పంపిన తల్లిదండ్రులు రాత్రైనా విద్యార్థి ఇంటికి తిరిగి రాకపోవడంతో అంతటా గాలించారు. ఎంతకీ ఆచూకీ లభించక చివరకుఐడియా బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. చుట్టు పక్కల పాప ఆచూకీ గురించి ఆరా తీశారు.
ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా.. ఆచూకీ దొరకకపోవడంతో అనుమానం వచ్చి అంగన్వాడీ కేంద్రానికి సమీపంలో ఉన్న సీసీ టీవీ పుటేజ్లను పరిశీలించారు. అయితే ఆ బాలిక అంగన్వాడీ కేంద్రం నుంచి బయటకు వచ్చినట్లు ఎక్కడా కనిపించకపోవడంతో.. రాత్రి 10 గంటల సమయానికి ఆ కేంద్రం తలుపులు తెరిచి పోలీసులు చూశారు. అక్కడే లోపల ఓ మూలన ఉన్న బాలికలను పోలీసులు గుర్తించారు. వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ చిన్నారిని వెతికిపెట్టిన పోలీసులకు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు. వెంటనే బాధ్యులైన అంగన్వాడీ టీచర్లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పాపకు ఏమైనా అయితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.