తెలంగాణ

telangana

By

Published : Jul 20, 2021, 5:04 AM IST

ETV Bharat / state

పెంచిన భూములు, ఆస్తుల విలువలు అమలులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం

రాష్ట్రంలో పెంచిన వ్యవసాయ, వ్యవసాయేతర భూములు.. ఆస్తుల విలువలు, రిజిస్ట్రేషన్​ ఛార్జీలు బుధవారం నుంచి అమలులోకి వచ్చేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్​ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మార్కెట్​ విలువల పెంపు కమిటీల ఛైర్మన్లు, కన్వీనర్లు, సభ్యుల సంతకాలతో కూడిన ఒరిజినల్​ కాపీలను ఇవాళ స్టాంపులు, రిజిస్ట్రేషన్​ శాఖ కమిషనర్​ కార్యాలయంలో అందజేయాలని జిల్లా రిజిస్ట్రార్లకు మౌఖిక ఆదేశాలందాయి. వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువ గరిష్ఠంగా 50 శాతం.. వ్యవసాయ భూముల విలువ ప్రాంతాల వారీగా గరిష్ఠంగా 4 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

పెంచిన భూములు, ఆస్తుల విలువలు అమలులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం
పెంచిన భూములు, ఆస్తుల విలువలు అమలులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం

రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల పెంపుపై కసరత్తు తుదిదశకు చేరింది. బుధవారం నుంచి కొత్త విలువలు అమలులోకి తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల జరిగిన మంత్రి మండలి ఉప కమిటీ, మంత్రి మండలి.. విలువలు పెంపునకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని.. మార్కెట్​ విలువలు పెంపునకు కసరత్తు జరిగినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్​ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

వ్యవసాయేతర భూములకు చెంది గజం రూ.పది వేలలోపు ప్రభుత్వ నిర్దేశిత విలువ కలిగి ఉంటే.. దానిపై 50 శాతం, రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య విలువ కలిగి ఉంటే 40 శాతం.. రూ.20 వేలకు పైగా నిర్దేశిత విలువ ఉంటే 30 శాతం లెక్కన పెరగనున్నాయి. అదే విధంగా నిర్మాణాలకు చెంది.. చదరపు గజం రూ.1,700లలోపు ప్రభుత్వ నిర్దేశిత విలువ ఉంటే దాని విలువ రూ.1,800లకు పెరగనుంది. అంటే చదరపు అడుగు కనీస ప్రభుత్వ నిర్దేశిత విలువ రూ.1,800లకు పెరగనుంది. అదే విధంగా చదరపు అడుగు రూ.1,700 నుంచి రూ.4 వేల మధ్య ప్రభుత్వ నిర్దేశిత విలువ ఉంటే.. దానిపై 20 శాతం, రూ.4 వేల కంటే ఎక్కువ విలువ ఉన్నట్లయితే దానిపై 30 శాతం లెక్కన విలువలు పెరగనున్నాయి.

ఒరిజినల్​ కాపీలు అందజేయాలి..

ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం.. మార్కెట్​ విలువల పెంపు కమిటీల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాల్సి ఉండటంతో ఆ బాధ్యతను ఇటీవల జిల్లా రిజిస్ట్రార్లకు అప్పగించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా పంచాయతీలు, పట్టణాలు, నగరాల వారీగా.. విలువలు పెంపునకు ఏర్పాటైన కమిటీలు ఆమోదముద్ర వేశాయి. గ్రామీణ కమిటీలకు ఆర్డీవోలు.. పట్టణ కమిటీలకు అదనపు కలెక్టర్ నేతృత్వం వహిస్తుండగా.. సబ్​ రిజిస్ట్రార్లు ఆయా కమిటీలకు కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రాంతాల వారీగా మార్కెట్​ విలువలను నిర్ధారిస్తూ కమిటీల్లోని సభ్యులు, ఛైర్మన్లు, కన్వీనర్లు సంతకాలు చేశారు. తాజాగా స్టాంపులు, రిజిస్ట్రేషన్​ శాఖ ఉన్నతాధికారులు.. 141 సబ్​ రిజిస్ట్రార్ల పరిధిలోని ఒరిజినల్​ కాపీలను తీసుకుని ఇవాళ హైదరాబాద్​లోని కమిషనర్​ కార్యాలయంలో అందజేయాలని జిల్లా రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు ఆదేశించారు.

రూ.3 వేల కోట్లకు తగ్గకుండా అదనపు ఆదాయం..

రిజిస్ట్రేషన్​ రుసుం ప్రస్తుతం 6 శాతంగా ఉండగా.. దానిని 7 లేదా 7.5 శాతానికి పెంచేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్​ శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. అయితే ఒక్క శాతం పెరిగితే రూ.వెయ్యి కోట్లు.. 1.5 శాతం పెంచితే రూ.1,500 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వస్తుందని.. స్టాంపులు, రిజిస్ట్రేషన్​ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విలువల పెంపు పూర్తయితే.. మొత్తం మీద రూ.3 వేల కోట్లకు తగ్గకుండా అదనపు ఆదాయం.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చేకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువ పెంపునకు రంగం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details