తెలంగాణ

telangana

By

Published : Jul 25, 2020, 4:27 PM IST

ETV Bharat / state

రాష్ట్రంలో కొనసాగుతున్న నియంత్రిత పంటసాగు సర్వే

రాష్ట్రంలో పంటల సాగు శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది వానాకాలం నుంచి అమల్లోకి వచ్చిన నియంత్రిత పంటసాగు విధానంలో భాగంగా పంటల వారీగా సర్వే కొసాగుతోంది. ఈ క్రమంలో ప్రధాన ఆహార పంట వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. వర్షాలు బాగా కురవడం, వాతావరణం కలిసి రావడం, ప్రాజెక్టులు, చెరువులు, బోర్లు, ఇతర సాగు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో అధిక శాతం వరిసాగుకు మొగ్గు చూపారు. ఇక రైతుబంధు పథకం కింద పెట్టుబడి రాయితీ పంపిణీ సహా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వరిలో సన్న రకాలు, దొడ్డు రకాలు రెండూ కూడా సాగు చేస్తున్నారని సర్వేలో వెల్లడైంది.

Agriculture Officers crop survey in telangana State
రాష్ట్రంలో కొనసాగుతున్న నియంత్రిత పంటసాగు సర్వే

రాష్ట్రంలో పంటసాగు జోరుగా సాగుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ప్రధాన ఆహార పంట వరి, వాణిజ్య పంట పత్తి, కంది, ఇతర పంటల సాగు చురుగ్గా ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ రైతాంగంలో అవగహన కల్పించడం వల్ల నియంత్రిత పంట సాగు విధానం పట్ల సానుకూల స్పందన లభిస్తోంది. ఈ వానాకాలంలో రాష్ట్ర సాధారణ వర్షపాతం 317.20 మిల్లీమీటర్లు ఉండగా.. ఇప్పటి వరకు వాస్తవ వర్షపాతం 406.5 మిల్లీమీటర్లు నమోదైంది. అంటే అదనంగా 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగులో అత్యధికంగా 612.3 మిల్లీమీటర్లు, అత్యల్పంగా నల్గొండ జిల్లాలో 234.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వరంగల్ అర్బన్, కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సిద్ధిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల్​, వనపర్తి, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, నారాయణపేట జిల్లాల్లో 20 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, కుమరంభీం అసిఫాబాద్​, మంచిర్యాల, నిజామాబాద్, వరంగల్ గ్రామీణ జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌, నల్గొండ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఒక్క నిర్మల్‌ జిల్లాలో మాత్రమే లోటు వర్షపాతం కొనసాగుతోంది. వాతావరణం ఆశాజనంగా ఉన్నప్పటికీ... కరోనా నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కూలీల కొరత వేధిస్తోంది. అసలే ఇది నాట్లు, కలుపుతీసే సీజన్​. వెయ్యి రూపాయలు కూలీ ఇస్తామన్నా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కూలీలు దొరికే పరిస్థితిలేదు. ఈ సారి తాము కూడా వరి సాగు చేస్తున్నామని పలువురు రైతులు తెలిపారు.

సాగులక్ష్యం దాదాపు చేరినట్టే..

ఈ వానా కాలంలో మొత్తం 1 కోటి 34 లక్షల 7,715 ఎకరాల్లో పంటలు సాగు చేయాలనేది సర్కారు లక్ష్యం. ఇప్పటి వరకు 81 లక్షల 59 వేల ఎకరాల్లో సాగు ముగిసింది. అంటే 79 శాతం మేర సాగైంది. గత ఏడాది ఖరీఫ్‌లో ఇదే సమయానికి 66 లక్షల 80, 959 ఎకరాల్లో సాగు పూర్తైంది. ప్రధాన ఆహార పంట వరి సాధారణ సాగు విస్తీర్ణం 27 లక్షల 25వేల 58 ఎకరాలు సాగు లక్ష్యం కాగా... 11 లక్షల 38,187 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి.అంటే.. 42 శాతం మేరకు వరి పంట ముగిసింది. కొన్నిచోట్ల కాస్త ఆలస్యంగా నాట్లు వేసుకునేందుకు రైతులు మడులు సిద్ధం చేసుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. వాణిజ్య పంట పత్తి 44 లక్షల50,029 ఎకరాలకుగాను 52 లక్షల 94,315 ఎకరాల్లో... అంటే అనుకున్న దాని కంటే 19 శాతం ఎక్కువ సాగైంది. ఇది రికార్డుగా నమోదయింది. కంది 7 లక్షల 61, 212 ఎకరాలకుగాను 7 లక్షల 99,391 ఎకరాల్లో... అంటే అనుకున్న దాని కంటే 5శాతం ఎక్కువ సాగయింది. పెసర 51 శాతం, మినుములు 59 శాతం, ఇతర పప్పుధాన్యాలు 15 శాతం సాగువుతున్నాయి. జొన్న 90 శాతం, సజ్జ 47, రాగి 38, చిరుధాన్యాలు 13 శాతం సాగయ్యాయి. వేరుశనగ 42,630 ఎకరాలకుగాను 8,332 ఎకరాలు సాగై 20 శాతంగా నమోదయింది. సోయాబీన్ 48,8753 ఎకరాలకుగాను 38,7615 ఎకరాల్లో సాగై.. 41 శాతంగా నమోదయింది. పొద్దుతిరుగుడు 13 శాతం, నువ్వులు 20 శాతం, ఆముదం 1 శాతం చొప్పున సాగవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్​ సూచన మేరకు ఈ సారి వరిలో సన్నరకం, దొడ్డురకం సాగు చేస్తున్నామని రైతులు చెబుతోన్నారు.

వరిసాగుకే జైకొట్టిన రైతులు..

వరి, పత్తి, కంది వంటి ప్రధాన పంటలకు కనీస మద్ధతు ధర ఉండటమే కాకుండా క్షేత్రస్థాయిలో ఇంటి వద్ద లేదా గ్రామంలోనే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండటం వల్ల రైతులకు భరోసా కల్పించినట్లైంది. ఇది దృష్టిలో పెట్టుకుని ఎక్కువమంది రైతులు రిస్క్‌ తక్కువగా ఉన్న ఆయా పంటల సాగు వైపు మొగ్గు చూపారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం, ఇతర నీటి వనరులు, చెరువుల్లో నీరు పుష్కలంగా వచ్చి చేరడం వల్ల ఏ మాత్రం నీటి అవకాశం ఉన్నా వరిసాగుకే రైతులు జై కొట్టారు. వరిలో కూడా దొడ్డు రకాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ జిల్లాల వారీ పంటల నమోదు, గణాంకాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. వరి పంట 30 నుంచి 35 వేల రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. అదే కౌలుకు భూమి తీసుకుంటే 8 నుంచి 12 వేల రూపాయలు అదనపు పెట్టుబడి అవుతుంది. గత యాసంగి సీజన్‌ తరహాలో ప్రతి గింజ కొనుగోలు చేసినప్పటికీ... కనీస మద్ధతు పెంచితే బాగుంటుందని రైతులు అభిప్రారయ పడుతున్నారు. ఎం.ఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఎమ్మెస్పీసహా సర్కారు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లైతే కష్టానికి ఫలితం, పెట్టుబడి చేతికొచ్చి కొంతైనా లాభాలు మిగులుతాయని రైతులు ఆశిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పంటల నమోదు..

రాష్ట్రంలో ఏ పంట సాగు చేశారనే వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. వ్యవసాయ శాఖ ప్రతి రైతు చరవాణికి సంక్షిప్త సందేశాలు పంపించింది. ఈ వివరాల నమోదు ఆధారంగానే వచ్చే అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న వ్యవసాయ మార్కెటింగ్ సీజన్‌లో వ్యవసాయోత్పత్తులు కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేసుకుంటుంది. క్షేత్రస్థాయిలో ఎవరైనా సాగు చేసిన పంట వివరాలు నమోదు చేయక పోయినట్లైతే... ఆ ఉత్పత్తులు మద్ధతు ధరలకు కొనుగోలు చేయబోరన్న ప్రచారం సాగుతోంది. ఒకవేళ పంట వేయలేదని నమోదైతే... వచ్చే అక్టోబరు మాసంలో మొదలయ్యే యాసంగి సీజన్‌లో రైతుబంధు పథకం కింద పెట్టుబడి రాయితీ వర్తించదన్న సంకేతాలు, ప్రచారం సాగుతున్న తరుణంలో... అలాంటిదేమీ లేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో రైతు వేసే పంటకు రైతుబంధు సాయానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గుంటలో ఏ పంట వేశారు... ఎంత విస్తీర్ణంలో సాగు చేశారన్న అంశాలపై వ్యవసాయ విస్తరణ సర్వే చేస్తున్నారు. ఏ రోజుకారోజు ఉదయం క్షేత్రాల్లో రైతులను కలిసి సేకరించిన సర్వే వివరాలు ఆన్‌లైన్‌లో హైదరాబాద్‌ వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు పంపుతున్నామని ఏఈఓలు వెల్లడించారు. తాజాగా నియంత్రిత పంట సాగువిధానం కింద రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామాల వారీగా పంట సర్వే సాగుతోంది. రైతు పేరు, గ్రామం, పట్టాదారు పాసుపుస్తకం నంబరు, సర్వే నంబరు, విస్తీర్ణం, పంట రకం, నీటి వసతి, మొక్కలు నాటిన సంవత్సరం, మొక్కల సంఖ్య, ఫోన్‌ నంబరు వంటి శాస్త్రీయం వివరాలతోపాటు తమ సంతకాలు కూడా సేకరిస్తున్నారని రైతులు తెలిపారు.


నియంత్రి పంట సాగు విధానంలో ప్రధానంగా వరి, పత్తి, కంది వంటి మూడు పంటలే సింహభాగంలో ఉన్నాయి. ఈ సారి మొక్కజొన్న వేయవద్దని చెప్పడం వల్ల రైతులు దానికి బదులు సోయాబీన్, వేరుశనగ, పొద్దుతిరుడు, ఇతర పప్పుధాన్యాలు, చిరుధాన్యాల పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో రైతుల నుంచి మద్ధతు ధరలకు సేకరణ కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..

ABOUT THE AUTHOR

...view details