.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నియంత్రిత సాగుకు సంబంధించి మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయా?
70 ఏళ్లుగా ప్రాజెక్టులు నిర్మించి, హరిత విప్లవాలు సహా ఎన్నో చేసి ఆహార భద్రత కల్పించుకుని... పోషక భద్రత వైపు వెళ్తున్నాం. తెలంగాణలో గత ఆరేళ్లుగా రైతు నిలదొక్కుకునేందుకు ఏం కావాలన్న విషయమై దృష్టి సారించి కరెంట్, నీళ్ల బాధలు తీర్చుకున్నాం. ఇప్పటి వరకు పంట పండించి మార్కెట్ వైపు చూశాం, ఇపుడు మార్కెట్ ఆధారిత వ్యవసాయం చేయాలన్నది ఆలోచన. ఇతర రాష్ట్రాల్లోనూ పరిస్థితులను స్థూలంగా అధ్యయనం చేశాం. కేరళ, తమిళనాడుకు బియ్యం అదనంగా అవసరం. ఏ పంట పడితే ఆ పంట వేసి రైతు ఆగమాగం అవ్వకూడదు. నియంత్రిత విధానంలో సాగు చేస్తే రైతు నష్టపోకుండా చూసే అవకాశం ఉంది. శాస్త్రీయంగా, ఇతర దేశాల్లోనూ దీని గురించి ఆలోచిస్తున్నారు.
రైతులు సహజంగా కొన్ని పంటల సాగుకు అలవాటు పడి ఉంటారు. ఒక్కసారిగా పంట మార్చాలంటే ఆ ప్రభావం ఎలా ఉంటుంది?
కొత్త పంటలను రైతు ముంగిట్లోకి తీసుకురావడం లేదు. ఉన్న పంటల విస్తీర్ణాన్నే పెంచాలని ప్రయత్నిస్తున్నాం. పత్తి, వరి, కందుల సాగు మన రాష్ట్ర బలం. వాటిలో విస్తీర్ణం పెంచుతున్నాం.
70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అంటున్నారు. కానీ, గత అనుభవాలు చేదుగా ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయమేంటి?
పత్తి విషయంలో గత నాలుగైదు సంవత్సరాలుగా దృష్టి సారించాం. నవంబర్, డిసెంబర్లో పత్తి కోతలు ఉండేలా చూడాలని చెప్తున్నాం. రైతులు అర్థం చేసుకున్నారు. దీంతో ఆర్నెళ్ల ఆంతర్యం ఉంటోంది. వర్షాకాలంలో దక్షిణ తెలంగాణలో మొక్కజొన్న 60 నుంచి 70శాతం సాగు చేస్తారు. 15 రోజుల పాటు వర్షాభావ పరిస్థితులు వస్తే దిగుబడి పడిపోయి రైతులు నష్టపోతారు. ఇలా జరగకుండా శాస్త్రీయంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే చర్యలు తీసుకుంటున్నారు.