తెలంగాణ

telangana

అచ్చెన్నపై అనిశా ప్రశ్నల వర్షం.. నేడు, రేపు కొనసాగనున్న విచారణ

By

Published : Jun 26, 2020, 9:45 AM IST

ఈఎస్​ఐ కొనుగోళ్లు జరిగే సమయానికి తాను ఆ శాఖ మంత్రిగా లేనని ఏపీకి చెందిన తెదేపా ఎమ్మెల్యే ‌అచ్చెన్నాయుడు.. అవినీతి నిరోధక శాఖ అధికారులకు స్పష్టం చేశారు. తన వద్దకు కొనుగోళ్ల దస్త్రం కూడా రాలేదని సమాధానమిచ్చారు.

achennaidu-interrogation-by-acb-on-esi-scam
అచ్చెన్నపై అనిశా ప్రశ్నల వర్షం.. నేడు, రేపు కొనసాగనున్న విచారణ

టెలీ ఈఎస్​ఐ కొనుగోళ్లల్లో అవకతవకల అభియోగాలపై అరెస్టైన అచ్చెన్నాయుడిని.. అనిశా అధికారులు తొలిరోజు 3 గంటలపాటు విచారించారు. అనిశా డీఎస్పీలు ప్రసాద్, చిరంజీవి ఇతర సిబ్బంది గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో.. అచ్చెన్న చికిత్స పొందుతున్న జీజీహెచ్​కు వచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సుధాకర్‌ను కలిసి.. అచ్చెన్నను కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని అందజేశారు. ఆ తర్వాత అచ్చెన్న చికిత్స పొందుతున్న గదికి వెళ్లిన అధికారులు.. న్యాయవాది, వైద్యురాలి సమక్షంలో సాయంత్రం 4.50 గంటల నుంచి రాత్రి 8 వరకూ 3 గంటలకు పైగా విచారించారు.

టెలీహెల్త్ సర్వీసెస్‌ వ్యవహారంపై ప్రధానంగా ప్రశ్నించారు. ఓ కంపెనీని సిఫారసు చేస్తూ సంతకం చేయడమంటే ఆ సంస్థకే టెండర్లు ఇవ్వాలని చెప్పడమే కదా అని అడిగారు. ఐతే ఆ కొనుగోళ్లు జరిగే సమయానికి తాను సంబంధిత శాఖ మంత్రిగా లేనని అచ్చెన్న జవాబిచ్చారు. ఆయా రాష్ట్రాల్లో వాటి అమలు ఎలా ఉందో అధ్యయనం చేయాలని మాత్రమే సూచిస్తూ.. మినిట్స్‌పైనే సంతకం చేశానన్నారు. మినిట్స్‌ అంటే ఏంటి? టెండర్లు ఓ కంపెనీకే ఇవ్వాలని సిఫార్సు చేయడం వల్ల మీకు బాగానే లబ్ధి చేకూరింది కదా? కొనుగోళ్ల నాటికి మంత్రిగా లేకున్నా... ప్రభావితం చేశారు కదా? మీలో ఏ లక్షణాలు చూసి చంద్రబాబు.. మంత్రి పదవి ఇచ్చారు? ఆయనతో మీకున్న సంబంధాలేంటి? మీ భార్య నుంచి సంక్రమించిన ఆస్తులేంటి? ప్రస్తుతం మీ ఆస్తులు, ఆదాయం, అప్పుల వివరాలేంటి?' అంటూ అచ్చెన్నపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ, రేపు కూడా విచారణ కొనసాగనుంది.

అనారోగ్యంతో ఉన్నా...

శస్త్ర చికిత్స చేయడంతో అచ్చెన్నాయుడికి ఇంకా రక్తం పడుతోందని, అనారోగ్యంతో బాధ పడుతున్న వ్యక్తిని రాత్రి 8గంటల దాకా విచారించడం సరికాదని అభ్యంతరం తెలిపానని ఆయన తరపు న్యాయవాది హరిబాబు చెప్పారు. మిగిలిన రెండు రోజులు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటలకు ముగించాలని కోరామన్నారు. విచారణ వివరాలను నమోదు చేసుకుంటే వాటిని పోలీసులు లాక్కునేందుకు ప్రయత్నించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 9గంటలకే విచారణ ఉంటుందని తెలియజేయటంతో ఆ సమయానికే వచ్చామని సాయంత్రం 4గంటల వరకూ అనిశా అధికారులు ఆసుపత్రికి రాలేదని హరిబాబు చెప్పారు. తన ఆరోగ్య పరిస్థితిపై అచ్చెన్నాయుడు గురువారం వైద్యులకు చెప్పగా గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు వచ్చి పరిశీలించారు. ఆయనకు పరీక్షలు చేయాలని సూచించారు.

ఇవీ చూడండి:అర్బన్​ ఫారెస్ట్​ పార్కులపై కేటీఆర్​ ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details