తెలంగాణ

telangana

ETV Bharat / state

కరవుసీమలో ఖర్జూరం పండిస్తున్న సాఫ్ట్​వేర్​ యువకుడు

ఖర్జూరం...అందరికీ మధుర ఫలమే. ఎక్కడో రాజస్థాన్, గుజరాత్​లోని ఎడారి ప్రాంతాల్లో మాత్రమే పండే ఖర్జూరం.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లో సాగు చేస్తున్నాడో సాఫ్ట్‌వేర్‌ యువకుడు. అది కూడా కరవు సీమ అనంతపురం జిల్లాలో. ఖరీదైన పంటగా చెప్పే ఖర్జూరాన్ని సాగు చేయాలంటే సాహసమే... అంతేకాదు అధిక పెట్టుబడితో వ్యవసాయం చేసి నాణ్యతతో ఉత్పత్తి చేస్తున్నారు.

By

Published : Jul 29, 2019, 5:39 PM IST

Updated : Jul 29, 2019, 7:35 PM IST

ఖర్జూరం సాగు

కరవు సీమలో ఖర్జూరం సాగు చేస్తున్న సాఫ్ట్​వేర్​ యువకుడు

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం కరవు సీమ జిల్లాగా పేరొందింది. నాణ్యమైన ఉద్యాన ఉత్పత్తుల ఖిల్లాగా పేరున్న ఇక్కడ ఎడారి పంట ఖర్జూరం సాగుదారుల్లో ఆశలు రేపుతోంది. అత్యంత కష్టమైన, అధిక పెట్టుబడితో కూడిన ఈ పంట అనంత గడ్డపై వస్తుందో.. రాదో తెలియకుండానే ఒక్కో మొక్కను 3 వేల 750 రూపాయలకు కొనుగోలు చేసి మరీ సుధీర్‌నాయుడు అనే యువకుడు విజయం సాధించాడు. సాఫ్ట్​వేర్ ఇంజినీర్‌ అయిన సుధీర్​నాయుడు సాగుపై మక్కువ పెంచుకున్నారు. అందరిలా వ్యవసాయం చేసి నష్టాలు తెచ్చుకోవడం ఇష్టంలేక ఎవరూ చేయని ఖర్జూరం పంటను సాగు చేశారు. అద్భుతమైన దిగుబడి సాధించి అందరితో ఔరా అనిపించుకుంటున్నారు. తాజా ఖర్జూరం పండ్లను కిలో 150 రూపాయల చొప్పున బెంగుళూరు, హైదరాబాద్ నగరాలకు ఎగుమతి చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.

ఆరేళ్ల క్రితం తమిళనాడులో ఓ మారుమూల పల్లెలో ఓ రైతు ఖర్జూరం పండ్లను రోడ్డుపక్కన విక్రయిస్తుండగా చూసిన సుధీర్ నాయుడు... ఐదు వేల రూపాయలిచ్చి పండ్లన్నీ కొనేశారు. ఆపై ఖర్జూరం తోటను చూపించాలని రైతును కోరారు. ఆ తర్వాత మొక్కలను అబుదాబి నుంచి తెప్పించి అనంతపురం జిల్లా బొందెలవాడలోని తన పొలంలో నాటించారు. ఎకరా భూమిలో 76 ఖర్జూరం మొక్కలను నాటించాక.. నాలుగేళ్లలో ఖర్జూరం గెలలు ఉత్పత్తి మొదలైంది. ఈ ఏడాది రెండోసారి దిగుబడి వచ్చింది. అత్యంత నాణ్యతగా ఖర్జూరం ఉత్పత్తి వచ్చింది. స్థానిక మార్కెట్ నుంచి పెద్దఎత్తున డిమాండ్ ఉన్నందున గ్రేడింగ్ చేసి మొదటి రకం పొరుగు రాష్ట్రాలకు పంపి, స్థానిక మార్కెట్​కు రెండోరకం పండ్లను విక్రయిస్తున్నారు. సుధీర్ నాయుడు సాగుచేసిన తోటను చూడటానికి పలు రాష్ట్రాల నుంచి యువకులు, ఐటీ ఉద్యోగులు తరలివస్తున్నారు.

ఖర్జూరం పంట అత్యంత ఖరీదైనదని...చిన్న, సన్నకారు రైతులు సాగు చేయడం కష్టమని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఖర్జూరం పంటను సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తే రాయితీ ఇవ్వడానికి ఉద్యానశాఖ ప్రణాళిక చేస్తోంది.

ఇదీ చూడండి : టిక్‌టాక్‌ మోజు.. అడవిలో దారితప్పిన యువకుడు

Last Updated : Jul 29, 2019, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details