కార్గిల్ సమీపంలోని గల్వాన్కు వంద కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వర్తిస్తున సమయంలో బాంబు పేలి అమరుడైన లాంచ్ నాయక్ లావేటి ఉమామహేశ్వరరావు(37) అంత్యక్రియలు బుధవారం స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నగరంలో అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.
పదిహేడున్నరేళ్లుగా ఆర్మీలో విధులు నిర్వర్తిస్తూ ప్రత్యేక శిక్షణ తీసుకొని నాలుగోసారి యుద్ధభూమిలో కాలుపెట్టిన సిక్కోలు ముద్దుబిడ్ద లావేటి ఉమామహేశ్వరరావు కార్గిల్ సమీపంలో శత్రు దేశాలు దాచి పెట్టిన బాంబులు నిర్వీర్యం చేస్తూ శనివారం అమరజీవుడయ్యాడు.
ముందురోజు వీడియోకాల్లో మాట్లాడిన మాటలే ఆఖరి మాటలని ఆ కుటుంబ సభ్యులకు అప్పుడు తెలియలేదు. ఇంటిల్లపాది సంతోషంగా ఉన్న సమయంలో కార్గిల్ రెజిమెంట్ సైనికాధికారులు మరణ వార్తను మృతుని అక్క సుబ్బలక్ష్మికి చరవాణి ద్వారా తెలియజేశారు.
దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ద్రిగ్భాంతికి గురయ్యారు. అందరితో సన్నిహితంగా ఉండే ఉమ ఇకలేడని హడ్కో కాలనీ ప్రజలు, స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు.
నువ్వు ఏడవద్దు.. నాన్న డ్యూటీకి వెళ్లారు
దేశ సేవలో వీరమరణం పొందిన తన తండ్రి ఇకలేడని 11 ఏళ్ల పెద్ద కుమార్తె వైష్ణవి ప్రియ ఒకవైపు విలపిస్తుంటే.. 'నువ్వు ఏడవద్దు.. నాన్న డ్యూటీకి వెళ్లారు ఇప్పుడే రారు'...అంటూ ఉమామహేశ్వరరావు నాలుగేళ్ల కుమార్తె పరిణిత చెప్పే మాటలు కుటుంబీకులను, బంధువులు, స్నేహితులను కంటతడి పెట్టించాయి.
కుమార్తెలను పట్టుకొని ఆ తల్లి బోరున విలపించే సంఘటన అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది.