తెలంగాణ

telangana

By

Published : Dec 3, 2019, 10:51 AM IST

ETV Bharat / state

కనులు లేవని.. కన్నీళ్లకేం తెలుసు...!

ఆ పేదింట.. తొలిపంటగా పుట్టింది హేమ. తన ముద్దుముద్దు చేష్టలతో ఎన్నో సంతోషాల్ని నింపింది. వయసు పెరిగే కొద్దీ చిట్టితల్లికి చూపు తగ్గిపోయింది. కళ్లెదుట అంతా చీకటి. అప్పుడప్పుడే వస్తున్న మాటల్ని కూడబలుక్కుని... ‘నాన్నా... అంతా చీకటిగా ఉంది’ అని బాధను వ్యక్తం చేసిందా బుజ్జాయి. తనకు ఏమీ కనిపించడం లేదంటూ చెప్పిన ప్రతిసారీ ఆ అమ్మానాన్నల గుండెల్లో అలజడి. అంతులేని ఆందోళన.

there-are-no-eyes-dot-dot-dot
కనులు లేవని.. కన్నీళ్లకేం తెలుసు...!

చిన్నపాటి జ్వరం వస్తేనే ఆసుపత్రికి వెళ్లి చూపించుకునే స్థోమత లేని వ్యవసాయ కూలీలు వారు. బిడ్డకు క్యాన్సర్‌ సోకిందని, అదే చూపును మింగేసిందని వైద్యులు చెప్పినప్పుడు తమ ప్రాణాలే పోయినంత బాధపడ్డారు. నాటి నుంచి వారి ముఖాలపై నవ్వు పోయింది... కునుకు కరవైంది. అనుక్షణమూ రోదన... అంతులేని ఆవేదన. తమ రెక్కల కష్టానికి దాతల చేయూతను జత చేసుకుని... చిన్నారిని కాపాడుకునేందుకు ఆ దంపతులు చేయని ప్రయత్నం లేదు.

విశాఖపట్నంలో చికిత్సల అనంతరం హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లి చూపించారు. అక్కడి వైద్యులు కీమో థెరపీ ఆరంభించారు. చికిత్సల్లో భాగంగా చూపు లేని కళ్లను తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం క్యాన్సర్‌ మహమ్మారి హేమను ప్రాణాపాయం దిశగా లాక్కువెళుతోంది.

భీమిని దుర్గాప్రసాద్‌, చిన్నమ్ములు భార్యాభర్తలు. వీరు ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామం దోశాలమ్మకాలనీలో ఉంటున్నారు. ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి హేమ వయసు నాలుగేళ్లు. హేమ పుట్టిన మూడు నెలలకే ఓ కంటిలో చిన్న చుక్క కనిపించింది. అది పెరిగి పెద్దదై క్యాన్సరై రెండు కళ్లకూ వ్యాపించింది. ఈ క్రమంలో బుజ్జాయి చూపు కోల్పోయింది. బిడ్డ వైద్య చికిత్సల కోసం ఆ కుటుంబం అప్పుల్లో కూరుకుపోయింది. దీనికితోడు హేమ రక్తం గ్రూపు ‘బి’ నెగెటివ్‌ కావడంతో దాతలు దొరక్క విలవిల్లాడిపోతున్నారు.

క్యాన్సర్​ సోకిన కళ్లతో చిన్నారి హేమ

కృత్రిమంగా గాజు కళ్లు పెట్టించాలని.. క్రమం తప్పక కీమో థెరపీ చేయించాలని వైద్యులు చెప్పారు. అందుకు అవసరమైన ఆర్థిక సాయం కోసం పేద దంపతులు వేడుకుంటున్నారు. చూస్తే కళ్లు చెమర్చే.. వింటే మనసు చలించే.. ఈ వ్యథపై ఆదివారం ‘ఈనాడు’ తూర్పుగోదావరి జిల్లా సంచికలో ‘నాన్నా.. చీకటిగా ఉంది’శీర్షికన కథనం ప్రచురితమైంది. దేశ విదేశాల నుంచి పలువురు దాతలు స్పందించారు. హేమను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆ పేదలకు మరింత సాయంతో పాటు నిండైన గుండె ధైర్యం అవసరం. ఇప్పటికే కళ్లు కోల్పోయిన హేమ ప్రాణాల్ని కాపాడేందుకు మనసున్న మారాజులు మరింత మంది కరుణ రథాలై కదలాల్సి ఉంది.

ఇదీ చదవండి:విశాఖ సాగర తీరాన... నౌకదళ దినోత్సవ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details