తెలంగాణ

telangana

By

Published : May 17, 2020, 3:32 PM IST

ETV Bharat / state

50రోజులు..9లక్షల చలాన్లు..ఆదాయం రూ.12కోట్లు..

రాష్ట్ర రాజధానిలో నిబంధనలు పాటించని వాహనదారులపై ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ద్విచక్ర వాహనానికి అద్దం లేకపోయినా... శిరస్త్రాణం లేకపోయినా ఇంటికి చలాన్లు పంపించారు. ఈ 50 రోజుల్లోనే 9 లక్షల చలాన్లు జారీ చేశారు ట్రాఫిక్ పోలీసులు. వీటి ద్వారా రూ.12కోట్లు వసూలు చేశారు.

trafic challans
trafic challans

ప్రయాణాల్లో స్వీయజాగ్రత్తలు తీసుకోవడం కచ్చితంగా అవసరమే. వాటిని ఉల్లంఘించినప్పుడు మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల మేరకు జరిమానాలు విధించడమూ అవసరమే. ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని ఎవరూ కాదనరు. కానీ కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో బిక్కచచ్చిపోయిన ప్రజలపై ఈ జరిమానాల భారం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. తమ ప్రయత్నమంతా వాహనదారుల ప్రాణరక్షణ కోసమే అని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నా... మధ్యతరగతి వాహనదారులకు ఇవి మోయలేని భారంగా మారుతున్నాయి.

అద్దం లేదని 3 లక్షలకు పైగా చలాన్లు

సాధారణంగా ద్విచక్రవాహనదారుడు శిరస్త్రాణం ధరించకుండా ప్రయాణించిప్పుడు జరిమానాలు విధిస్తే ఎవరూ తప్పు పట్టరు. కానీ కరోనా కష్టకాలంలో వాహనానికి సైడ్ మిర్రర్ లేదని... పెట్టుకున్న శిరస్త్రాణం సరిగా లేదని... వెనక కూర్చున్న వ్యక్తికి శిరస్త్రాణం లేదనే కారణాలతో జరిమానాలు విధిస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది. ఈ 50 రోజుల వ్యవధిలోనే ఏకంగా 9లక్షల పైచిలుకు చలాన్లు విధించారు. వీటిలో అద్దం లేని కారణానికితోడు వెనకు కూర్చున్న వ్యక్తికి శిరస్త్రాణం లేదనే కారణంతో సుమారు 3.28లక్షల చలాన్లు జారీ చేయడం గమనార్హం.

కోట్లల్లో జరిమానాలు

అసలే కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయి కొందరు... ఉన్న ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియక మరికొందరు మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో పోలీసులు జరిమానాలతో విరుచుకుపడుతున్నారు. గత 50 రోజుల్లోనే కోట్లలో జరిమానాలు వడ్డించారంటే పరిస్థితి అర్థమవుతోంది.

  • కూకట్‌పల్లిలో ఉండే ఓ ప్రైవేటు ఉద్యోగి ద్విచక్రవాహనంపై గత నెల 7నుంచి ఈనెల 2 వరకు ఐదు చలాన్లు జారీ అయ్యాయి. ఒక్కోటి రూ.135 చొప్పున మొత్తం రూ.675 జరిమానా విధించారు. శిరస్త్రాణం సరిగా లేదని... అద్దం అమర్చుకోలేదనే కారణం చూపారు.
  • మూసాపేటకు చెందిన మరో చిరుద్యోగి ద్విచక్రవాహనంపై గత నెల 13 నుంచి ఈనెల 11 వరకు ఇవే కారణాలతో నాలుగు చలాన్లు జారీ చేశారు. రూ.540 జరిమానా విధించారు.

సైబరాబాద్ పరిధిలో మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనల కింద గత 50 రోజుల్లో రూ.12కోట్ల జరిమానాలు విధించారు. వీటిలో ద్విచక్రవాహనాలకు అద్దం లేదనే కారణంతోనే రూ.1.25కోట్ల జరిమానాలు వసూలు చేశారు. వెనక కూర్చున్న వ్యక్తులు శిరస్త్రాణాలు ధరించలేదనే కారణంతో ఏకంగా రూ.3.18కోట్ల జరిమానాలతో వీరబాదుడు బాదారు.

ఇదీ చదవండి:గోదావరి నది పరివాహక జిల్లాల మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష

ABOUT THE AUTHOR

...view details