తొలిసారిగా రాష్ట్రంలో ఒక్క రోజులో 40 వేల పరీక్షలకు పైగా నిర్వహించడం విశేషం. ఈనెల 22 రాత్రి 8 గంటల వరకూ మొత్తంగా కొవిడ్ పాజిటివ్ల సంఖ్య 1,04,249కి పెరగగా, పరీక్షల సంఖ్య కూడా 9,31,839కి చేరుకుంది. మరో 1,347 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ ఆదివారం కరోనా సమాచారాన్ని విడుదల చేసింది.
పరీక్షలు పెంచడంతో...
రాష్ట్రంలో ఒకపక్క నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచుతుంటే.. మరోవైపు కరోనా కేసుల నమోదు శాతం తగ్గుతోంది. గత వారం రోజుల కేసుల సరళిని పరిశీలిస్తే ఇదే అవగతమవుతోంది. ఈనెల 16(ఆదివారం)న పాజిటివ్ల శాతం 10.16 ఉండగా.. క్రమేణా తగ్గుతూ 22(శనివారం) నాటికి 5.86 శాతానికి చేరింది. పరీక్షల సంఖ్య పెంచడంతో పాజిటివ్ల సంఖ్య తగ్గుతున్నట్లుగా వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. జీహెచ్ఎంసీ(హైదరాబాద్) పరిధిలో కేసుల శాతం తగ్గుతున్నట్లుగా భావిస్తున్నాయి. ప్రస్తుతం రోజుకు 40వేలకు పైగా పరీక్షలు చేస్తుండగా.. వీటిలో 30 శాతం (దాదాపు 10 వేలకు పైగా) పరీక్షలు జీహెచ్ఎంసీ పరిధిలోనే నిర్వహిస్తున్నారు. అయినా కేసుల నమోదులో పెద్దగా మార్పు కనిపించడం లేదనీ, గతంతో పోల్చితే ఇటీవల కాలంలో జీహెచ్ఎంసీలో కరోనా ఉద్ధృతి తగ్గిందని వైద్యవర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. పరీక్షల్లో దాదాపు 70 శాతం వరకూ జిల్లాల్లోనే చేస్తున్నారు. గత వారం రోజుల్లో జిల్లాల్లో పరీక్షల సంఖ్య క్రమేణా పెంచుతుండడంతో.. ఆ మేరకు ఫలితాలు కూడా కనిపిస్తున్నట్లుగా వైద్యవర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాద్లో 100 మందికి పాజిటివ్ వస్తే.. వారిద్వారా 85 మందికి వైరస్ వ్యాప్తి చెందుతోంది. అదే గ్రామీణంలో 100 మందికి పాజిటివ్ వస్తే.. వారిద్వారా 130 మందికి వైరస్ సోకుతోందని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీన్నిబట్టి రాజధానిలో వైరస్ వ్యాప్తి తగ్గినట్లు అవగతమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1076 యాంటిజెన్ కేంద్రాల్లో ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ప్రభుత్వ వైద్యంలో 16 ల్యాబ్ల్లో, ప్రైవేటులో 31 ల్యాబ్ల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను చేస్తున్నారు.
కోలుకున్న వారు 80 వేలకు పైనే