తెలంగాణ

telangana

By

Published : Jul 12, 2020, 6:41 AM IST

ETV Bharat / state

గ్రేటర్‌లో కరోనా విజృంభణ... 736 కేసులు నమోదు

గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా బస్తీల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అంబర్‌పేట, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌, సంతోష్‌నగర్‌, మలక్‌పేట, జియాగూడ తదితర ప్రాంతాల్లోని బస్తీల్లో నిత్యం కేసులు వెలుగుచూస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వ్యక్తి పరారయ్యాడని గుర్తించారు.

hyderabad corona cases
hyderabad corona cases

కరోనా మహమ్మారి నగరంలోని పలు బస్తీల్లో తిష్ఠవేసి అక్కడక్కడే విస్తరిస్తోంది. గత నెల రోజులుగా కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అంబర్‌పేట, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌, సంతోష్‌నగర్‌, మలక్‌పేట, జియాగూడ తదితర ప్రాంతాల్లోని బస్తీల్లో నిత్యం కేసులు వెలుగుచూస్తున్నాయి. వారాంతపు సంతలు, నియంత్రణ లేకుండా దుకాణాల నిర్వహణ, జనం గుంపులుగా తిరుగుతుండటంతో బస్తీల్లో వ్యాప్తి పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

కాస్త ఊరట

గ్రేటర్‌ వ్యాప్తంగా శనివారం 736 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 9 మంది మృతిచెందగా వీరిలో ఓ బాలింత(22) కూడా ఉందని పేర్కొన్నారు. అనుమానిత లక్షణాలున్నవారు దగ్గర్లోని కొవిడ్‌ పరీక్ష కేంద్రాలను ఆశ్రయించాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈనెల 8న 1,590 కేసులు నమోదైతే, 9న 918, 10న 762 మందికి కొవిడ్‌ సోకినట్లు తేలింది. శనివారం ఆ సంఖ్య ఇంకాస్త తగ్గడం కొంతమేర ఊరటనిచ్చింది. అంబర్‌పేట సర్కిల్‌లో కొత్తగా 29 మందికి వైరస్‌ సోకింది. కాచిగూడ చప్పల్‌బజార్‌లో ఒకరు, అంబర్‌పేట ప్రేంనగర్‌లో ఒకరు, తురాబ్‌నగర్‌లో ఒకర్ని కరోనా బలిగొంది. బస్తీల్లో వైరస్‌ విజృంభిస్తోందని చెప్పేందుకు అంబర్‌పేట సర్కిల్‌ ఉదాహరణ. ఈ సర్కిల్‌లోని సుమారు 23 బస్తీల్లో నిత్యం లెక్కకు మించి మహమ్మారి బారిన పడుతున్నారు.

పాజిటివ్ వచ్చిన వ్యక్తి పరారీ

ముషీరాబాద్‌ యూపీహెచ్‌సీ పరిధిలో 12 మందికి, భోలక్‌పూర్‌ బైబిల్‌హౌస్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్‌సీ) పరిధిలో ఇద్దరికి వైరస్‌ సోకింది. మారేడుపల్లి, తుకారాంగేట్‌ ప్రాంతాలకు చెందిన నలుగురు, యూసఫ్‌గూడ డివిజన్‌ 19, వెంగళరావునగర్‌ 8, ఎర్రగడ్డ 11, రహ్మత్‌నగర్‌ 11, బోరబండ 13 మంది, సంతోష్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో 51 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఉప్పల్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 15, మల్కాజిగిరి ఏరియా ఆస్పత్రిలో 42 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వ్యక్తి పరారయ్యాడని గుర్తించారు.

సీఆర్‌పీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

కరోనాతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీఆర్‌పీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌(51) శనివారం మృతిచెందారు. ఆయన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. గత నెల కొవిడ్‌19 పాజిటివ్‌గా నిర్ధారించారు.

ఇదీ చదవండి :రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details