తెలంగాణ

telangana

By

Published : Jul 21, 2020, 6:03 AM IST

ETV Bharat / state

భాగ్య నగరంలో తగ్గుదల.. శివారుల్లో పెరుగుదల!

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఐదారు రోజులుగా కరోనా తగ్గుముఖం పట్టింది. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. సోమవారం 510 కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. శివారు ప్రాంతాల్లో పెరుగుతోంది. శివార్ల నుంచి పనుల నిమిత్తం నగరానికి నిత్యం వచ్చి పోయే వారు ఎక్కువ. తద్వారా వైరస్‌ ఆయా ప్రాంతాలకు పాకుతోంది.

coronavirus
coronavirus

వారం క్రితం వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో విజృంభించిన కరోనా బాధితుల సంఖ్య గత ఐదారు రోజులుగా తగ్గుముఖం పట్టింది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని నగర శివారు ప్రాంతాల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

తాజాగా సోమవారం గ్రేటర్‌ హైదరాబాద్‌లో 510 మందికి కొవిడ్‌-19 సోకింది. రంగారెడ్డి జిల్లాలో 106, మేడ్చల్‌ జిల్లాలో 76 కేసులు బయటపడ్డాయి. గాంధీతోపాటు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారు. జ్వరం, దగ్గు, నీరసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

సొంతూళ్లకు

వైరస్‌ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరోవైపు శివార్ల నుంచి పనుల నిమిత్తం నగరానికి నిత్యం వచ్చి పోయే వారు ఎక్కువ. తద్వారా వైరస్‌ ఆయా ప్రాంతాలకు పాకుతోంది.

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 66 మందికి, కూకట్‌పల్లి, మూసాపేట, బాలానగర్‌, ఎల్లమ్మబండ, హస్మత్‌పేట తదితర ప్రాంతాల్లో 33, శేరిలింగంపల్లి ప్రాంతంలో 46, యూసఫ్‌గూడ సర్కిల్‌లో 23, మల్లాపూర్‌లో 21, ఉప్పల్‌లో 67, కాప్రాలో 10, శామీర్‌పేటలో 15 మందిలో కరోనా నిర్ధారణ అయింది.

ఉదయం నుంచే క్యూలు

గ్రేటర్‌ వ్యాప్తంగా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్న అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఉదయం 8 గంటల నుంచే అనుమానితులు పడిగాపులు పడుతున్నారు.

ఒక్కో కేంద్రంలో 100-150 వరకు పరీక్షలు చేస్తున్నారు. అంతకుమించే అనుమానితులు వస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్సలు అందించడంలో జాప్యం చోటుచేసుకుంటోందనే విమర్శలు విన్పిస్తున్నాయి.

వాస్తవానికి పాజిటివ్‌ వచ్చినా...సాధారణ లక్షణాలుంటే ఇంటి వద్దే క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరికి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కరోనాను ఎదుర్కొనేందుకు మందులు, ఇతర సామగ్రితో కూడిన పెట్టె అందిస్తున్నారు.

ఎక్కువ లక్షణాలు ఉన్నవారిని గాంధీ ఆసుపత్రికి తరలించాలి. చాలామంది పాజిటివ్‌ వచ్చినా చికిత్సల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కిట్లు సమయానికి అందించడం లేదని అంటున్నారు. చాలామంది ప్రైవేటు ఆసుపత్రిలో చేరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details