తెలంగాణ

telangana

By

Published : Apr 22, 2020, 8:46 AM IST

ETV Bharat / state

ఏపీలో విస్తరిస్తున్న కరోనా.. కొత్త కేసులు 39

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం వివిధ జిల్లాల్లో 39 పాజిటివ్‌ కేసుల నమోదుతో... రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 761కి చేరింది. మహమ్మారి కాటుకు మరో ఇద్దరు చనిపోయారు.. కరోనా మృతుల సంఖ్య 22కి పెరిగింది. ఇప్పటి వరకు 96 మంది వైరస్‌ బాధితులు కోలుకున్నారు.

corona
రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా.. కొత్త కేసులు 39

ఏపీలో కొవిడ్‌ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కర్నూలు జిల్లాలో మరో 10 మంది వైరస్‌ బారిన పడగా... కేసుల సంఖ్య 184కి చేరింది. ఇప్పటి వరకు కర్నూలు నగరంలో 90 కేసులు నమోదవగా, నంద్యాలలో 42 మంది వైరస్​ బారిన పడ్డారు. మిగిలిన ప్రాంతాల్లో కొన్ని కేసులు ఉన్నట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. ఇక రాయలసీమ వర్శిటీ, ఆళ్లగడ్డ, గోస్పాడు, సి.బెళగల్ క్వారంటైన్​ కేంద్రాల్లో ఉన్న 48 మందికి రెండుసార్లు చేసిన పరీక్షల్లో నెగిటివ్ రావడం వల్ల... ఇళ్లకు పంపించి వేశారు. ఇంకా 12 వందల 10 మంది క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. కరోనా నమూనాలు పరీక్షించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ డిటెక్షన్ యంత్రాలను... మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పరిశీలించారు.

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం 13 మందికి వైరస్‌ ఉన్నట్లు తేలింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 162కి చేరింది. దిల్లీ వెళ్లొచ్చిన వ్యక్తులు, వారు కలిసినవారిని గుర్తించిన అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహించారు. అర్బన్ పరిధిలో వెలుగుచూసిన 107 కేసుల్లో ముగ్గురికి వైరస్‌ ఎలా సోకిందో అంతుపట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చినవారు, దిల్లీ నుంచి వచ్చినవారితో గానీ ఈ ముగ్గురికీ ఎలాంటి సంబంధాలూ లేవు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, పరిస్థితిని ఆరా తీస్తున్నారు.

కడప జిల్లాలో కొత్తగా ఆరుగురు కరోనా బారిన పడ్డారు. వీరంతా దిల్లీలో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో సంబంధం ఉన్నవారేనని అధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 46 కరోనా కేసులు నమోదవగా... 19 మంది డిశ్చార్జ్​ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 4 కేసుల నమోదుతో.... మొత్తం కేసుల సంఖ్య 39కి చేరింది. ఈ పరిస్థితుల్లో కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఏ మాత్రం లోటుపాట్లు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో మంగళవారం మూడు కరోనా వైరస్‌ కేసులు బయటపడ్డాయి. మచిలీపట్నంలో ఓ పాజిటివ్ కేసుతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసు నమోదైన వ్యక్తి నివాస ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి.... జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అనంతపురం జిల్లాలో మరో మూడు కేసులతో... మొత్తం కరోనా బాధితుల సంఖ్య 36కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో మరో 300 మంది అనుమానితుల్ని క్వారంటైన్‌లో ఉంచారు. ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఇద్దరికి నెగిటివ్‌ రావటంతో... ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ చేశారు. చిత్తూరు జిల్లాలో మంగళవారం కొత్త కేసులు నమోదు కాకపోయినా... సోమవారం నాటి పరిణామాలతో అధికారులు అత్యంత జాగ్రత్త వహిస్తున్నారు. రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో అనుమానిత లక్షణాలు ఉన్న వారి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు.

విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనకాపల్లిలోని ఎన్టీఆర్​ జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. రోజుకు 30మంది చొప్పున పరీక్షలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:'ఎవరూ ఈ విద్యా సంవత్సరం ఫీజులు పెంచొద్దు

ABOUT THE AUTHOR

...view details